Monday, May 6, 2024

లారీని ఢీకొట్టిన భారీ రైనో-ట్వీట్ చేసిన అస్సాం సీఎం హిమంత బిశ్వ‌శ‌ర్మ‌

వేగంగా వ‌స్తోన్న లారీని ఢీకొట్టింది ఓ భారీ రైనో.. లారీ డ్రైవర్ అది గమనించి కాస్త పక్కకు తప్పించాడు. అయినా రైనో వేగంగా పరుగెత్తుకు వచ్చి.. లారీ పక్క భాగంలో బలంగా ఢీకొట్టింది. అస్సాంలోని ప్రఖ్యాత కజిరంగ నేషనల్ పార్క్ లో ఈ ఘటన జరిగింది. అయితే లారీ వేగంగా ఉండటం, పక్కభాగంలో ఉక్కు ప్లేట్లు ఉన్నచోట ఢీకొట్టడంతో రైనోకు బలంగానే దెబ్బతగిలి కింద పడిపోయింది. లారీ వెళ్లిపోయాక లేచి నిలబడిన రైనో.. మళ్లీ పడిపోయింది. ఆ వెంటనే లేచి అడవి లోపలికి పరుగెత్తింది. ఈ ఘటనలో రైనోకు బలంగానే గాయమై ఉంటుందని భావిస్తున్నారు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తన ట్విట్టర్ ఖాతాలో దీనికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు. రైనోలు మనకు ప్రత్యేక స్నేహితులు. వాటి స్థలంలోకి వెళ్లి మనం వాటిని ఇబ్బంది పెట్టొద్దు. హల్దిబరి ప్రాంతంలో జరిగిన ఓ దురదృష్టకర ఘటన ఇది. రైనో ప్రమాదానికి గురైంది. ఆ లారీని గుర్తించి జరిమానా వేశాం. కజిరంగ నేషనల్ పార్కులో ఇలాంటి ఘటనలు జరగకుండా 32 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్ కారిడార్ (ఫ్లైఓవర్ తరహాలో) నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామ‌ని హిమంత బిశ్వశర్మ క్యాప్షన్ పెట్టారు. ఈ వీడియోకు లక్షన్నరకుపైగా వ్యూస్, వేలకొద్దీ రీట్వీట్లు వస్తున్నాయి. రైనో గాయపడటంపై అంతా బాధ వ్యక్తీకరిస్తున్నా.. లారీ డ్రైవర్ ది తప్పు అనడం, ఫైన్ వేయడంపై మాత్రం భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. లారీ డ్రైవర్ రైనోను కాపాడటానికి బాగానే ప్రయత్నించాడు. అతడి తప్పేం లేదు. నిజానికి చెప్పాలంటే.. అక్కడ రోడ్డు వేసిన ప్రభుత్వానిదే ఈ తప్పు అని కొందరు నెటిజన్లు పేర్కొంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement