Friday, May 3, 2024

కేంద్రం మరో కీలక నిర్ణయం.. ఇకపై ముందస్తు రిజిస్ట్రేషన్ లేకుండానే వ్యాక్సిన్

కరోనా వ్యాక్సినేషన్‌పై కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 18-44 ఏళ్ల మధ్య వయసు గల వారు ముందస్తు నమోదు లేకుండానే ప్రభుత్వ కొవిడ్‌ వ్యాక్సిన్‌ కేంద్రాల వద్ద ఆన్‌సైట్‌ (అప్పటికప్పుడు) రిజిస్ట్రేషన్‌ చేసుకునే వీలు కల్పించింది. టీకా వృథాను తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. దీనిపై తుది నిర్ణయం రాష్ట్రాలదేనని చెప్పింది. ప్రైవేటు కేంద్రాలు ఆన్‌సైట్‌ రిజిస్ట్రేషన్ చేపట్టవద్దని పేర్కొంది.

చాలా ప్రాంతాల్లో టీకా డోసులు ముందుగా బుక్ చేసుకుని, తమకు నిర్దేశించిన రోజున వారు రాకపోవడంతో ఆ డోసులు వృథా అవుతున్నాయి. దీంతో టీకాల వృథాను అరికట్టేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇంటర్నెట్ సదుపాయం లేనివారికి, మొబైల్ ఫోన్లు వాడకం తెలియనివారికి కూడా ఆన్‌సైట్ నమోదుకు అనుమతి ఇస్తున్నట్లు కేంద్రం తెలిపింది.

అయితే ఇది తమ నిర్ణయం మాత్రమేనని, దీన్ని అమలు చేసే విషయంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు స్వేచ్ఛ ఇచ్చామని కేంద్రం తెలిపింది. ఒకవేళ రాష్ట్రాలు తమ ప్రతిపాదనకు సమ్మతిస్తే… ఈ ఆన్‌సైట్ రిజిస్ట్రేషన్ కేవలం ప్రభుత్వ కొవిడ్ టీకా కేంద్రాల వద్దనే అమలు చేయాలని, ప్రైవేటు టీకా కేంద్రాల వద్ద స్పాట్ రిజిస్ట్రేషన్లు చేపట్టవద్దని స్పష్టం చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement