Monday, April 29, 2024

Carona: మళ్లీ పంజా విసురుతున్న కొవిడ్.. చైనా, ర‌ష్యాల్లో డేంజ‌ర్ బెల్స్‌

Covid-19: కరోనా మళ్లీ పంజా విసురుతోంది. పలు దేశాల్లో కొవిడ్‌ కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. బ్రిటన్‌లో శుక్రవారం కొత్తగా దాదాపు 50 వేల కేసులు నమోదయ్యాయి. రష్యా, ఉక్రెయిన్‌, రుమేనియాల్లో కొవిడ్‌ తీవ్రత ఎక్కువవుతోంది.

చైనాలోనూ మహమ్మారి కలకలం సృష్టిస్తోంది. దీంతో అక్కడి ప్రభుత్వం ఆంక్షలను కఠినతరం చేసింది. ప్రజలకు పూర్తిస్థాయిలో వ్యాక్సిన్లు అందకపోవడం, కరోనా కొత్త వేరియంట్ల వ్యాప్తి తీవ్రంగా ఉండటమే దీనికి కారణంగా భావిస్తున్నారు.

ర‌ష్యాలో శుక్రవారం 37,141 మంది వైరస్‌ బారిన పడ్డారు. ఆరోగ్యం విషమించి మరో 1,064 మంది చనిపోయారు. దీంతో అక్కడ మరణాల సంఖ్య 2,28,453కు చేరింది. దీంతో ఎక్కడికక్కడ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని అధ్యక్షుడు పుతిన్‌ అధికారులను ఆదేశించారు. వైరస్‌ తీవ్రత అధికంగా ఉన్నచోట్ల శనివారం నుంచే లాక్‌డౌన్‌ అమలుచేయాల‌ని నిర్ణ‌యించారు. మాస్కోలో ఈనెల 28 నుంచి లాక్‌డౌన్‌ అమలు చేయనున్నారు. దేశంలో ఇప్పటివరకూ 45% మందికే పూర్తిస్థాయిలో వ్యాక్సిన్‌ అందించారు.

యూరప్ కంట్రీలోని ఉక్రెయిన్‌లో ఫైజర్‌, మోడెర్నా, ఆస్ట్రాజెనికా, సినోవాక్‌ టీకాలు అందుబాటులో ఉన్నా, కేవలం 15% మంది మాత్రమే పూర్తిస్థాయిలో వ్యాక్సిన్‌ తీసుకున్నారు. అర్మేనియా తర్వాత అత్యంత మందకొడిగా టీకా కార్యక్రమం సాగుతున్నది ఉక్రెయిన్‌లోనే. దేశంలో ఇప్పటివరకూ సుమారు 27 లక్షల మంది కొవిడ్‌ బారిన పడగా, 63 వేల మంది చ‌నిపోయారు. ఇరాన్‌, రుమేనియాల్లోనూ కొవిడ్‌ ఉద్ధృతి కొనసాగుతోంది.

కరోనా పుట్టిల్లయిన చైనాలో ఐదు రోజులుగా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. షాంఘైకు చెందిన వృద్ధ దంపతులు, మరికొందరు పర్యాటకులు గాన్సు, ఇన్నర్‌ మంగోలియా, జియాన్‌ తదితర ప్రాంతాల్లో ఇటీవల పర్యటించారు. వీరందరికి కరోనా సోకినట్టు తేలడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఒక్కకేసు కూడా ఉండకూడదన్న పట్టుదలతో మళ్లీ ఎక్కడికక్కడ ఆంక్షలను కఠినతరం చేశారు.

- Advertisement -

కేసులు వెలుగుచూసిన చోట స్కూళ్లు, కాలేజీలు, పర్యాటక ప్రాంతాలను మూసివేశారు. విమాన సర్వీసులను నిలిపివేశారు. లాంజోవ్‌ నగర ప్రజలు అనవసరంగా బయటకు రావద్దని గట్టి ఆదేశాలు జారీచేశారు. అత్యవసరమై బయటకు వచ్చేవారు తప్పనిసరిగా కొవిడ్‌ నెగెటివ్‌ ధ్రువపత్రం చూపించాలని ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement