Friday, April 26, 2024

హవా మే ఉడతా జాయే జనసేన!

ఆంధ్రప్రదేశ్ లో జనసేన-బీజేపీ మిత్రపక్షాలు. దాదాపు ఏడాదిన్నర క్రితం రెండుపార్టీల మధ్య దోస్తీ కుదిరింది. అప్పటి నుంచి రెండు పార్టీలు చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నాయి. గత పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ఇరు పార్టీలు కలిసి పోటీ చేశాయి. ప్రస్తుతం తిరుపతి ఉపఎన్నికలో ఇరు పార్టీ ఉమ్మడి అభ్యర్థి తరుపున ప్రచారం చేస్తున్నాయి. అయితే, ఈ మధ్య పవన్ కల్యాణ్ కు బీజేపీ అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు కనిపిస్తోంది. ఏపీకి కాబోయే సీఎం పవన్ కల్యాణే అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా సంచలన ప్రకటన చేశారు. తాజాగా మరో బీజేపీ నేత సునీల్ దియోధర్ పవన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

పవన్ అంటే తనకు చాలా ఇష్టం అని, ఆయన నటించిన అత్తారింటికి దారేది చిత్రాన్ని చూశానని తెలిపారు. అంతేకాదు పవన్ కల్యాణ్ జాతీయ నేత అంటూ ఆయనపై పొగడ్తలు కురిపించారు. అత్తారింటికి దారేది సినిమాలో ” హవా మే ఉడతా జయేరే మేరా లాల్ దుపట్టా మల్ మల్ కా ” పాట పాడిన పవన్ కళ్యాణ్ ఒక నేషనలిస్ట్ లీడర్ అని వ్యాఖ్యానించారు. టీడీపీ, వైసీపీలో నేషనల్ లీడర్లు లేరని చెప్పారు. అయితే, పవన్ కు బీజేపీ మరి ఇంత ప్రాధాన్యం ఇవ్వడం ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.

ఇదిఇలా ఉంటే.. ఏపీలో తిరుపతి ఉపఎన్నికపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. గెలుపు కోసం ప్రధాన పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. జనసేన-బీజేపీ ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభ గెలుపు కోసం రెండు పార్టీల ముఖ్యనేతలంతా తిరుపతిలో మకాం వేశారు. ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్ రంగంలోకి దిగబోతున్నారు. ఏప్రిల్ 3న పవన్ కల్యాణ్ తిరుపతిలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఏపీ రాజకీయాల్లో బీజేపీ-జనసేన పొత్తు మంచి ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందనే విశ్వాసం ప్రజల్లో కల్పించే విధంగా ఈ పాదయాత్ర ఉంటుందని ఇరు పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement