Friday, May 17, 2024

హైదరాబాద్ సంస్థ మరో ఘనత.. బ్రీఫ్ కేసులో పోర్టబుల్ వెంటిలేటర్

కరోనా పేషెంట్లకు చికిత్స అందించడంలో వెంటిలేటర్లు కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌కు చెందిన అపోలో కంప్యూటింగ్ ల్యాబ్స్ అనే సంస్థ… సీఎస్ఐఆర్, నేషనల్ ఏరోస్సేస్ ల్యాబ్స్ సహకారంతో పోర్టబుల్ వెంటిలేటర్ ను రూపొందించింది. దీనికి ‘స్వస్థ్ వాయు ఇన్వాజివ్ వెంటిలేటర్’ గా నామకరణం చేశారు. ఇది ఓ బ్రీఫ్ కేసు పరిమాణంలో, మూడు కిలోల కన్నా తక్కువ బరువుతో ఉంటుంది. దీన్ని ఇళ్లలో సులువుగా ఉపయోగించుకోవచ్చు.

పోర్టబుల్ వెంటిలేటర్ తయారీపై అపోలో కంప్యూటింగ్ ల్యాబ్స్ అధినేత బద్దం జైపాల్ రెడ్డి స్పందించారు. హైదరాబాదుతో పాటు బెంగళూరు నగరంలోనూ ఈ మినీ వెంటిలేటర్ ను ప్రయోగాత్మకంగా వినియోగించనున్నట్టు తెలిపారు. దీన్ని కరోనా బాధితులకే కాదు, శ్వాసకోశ వ్యాధిగ్రస్తులకు, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నవారికి కూడా ఉపయోగించవచ్చని సంస్థ ప్రతినిధులు వివరించారు. ఇళ్లలోనే కాకుండా, చిన్న ఆరోగ్య కేంద్రాల్లో ఉపయోగించేందుకు ఈ పోర్టబుల్ వెంటిలేటర్ ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రపంచంలో ఈ తరహా సాంకేతికతతో కూడిన వెంటిలేటర్ ఇదొక్కటేనని, ఈ వెంటిలేటర్ పనితీరు పట్ల జాతీయ ఆరోగ్య భద్రతా ప్రమాణాల ల్యాబ్‌లు సంతృప్తి వ్యక్తం చేసినట్టు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement