Friday, April 26, 2024

కీచక ఉపాధ్యాయులు.. నలుగురు విద్యార్థినిలపై అత్యాచారం

ఉపాధ్యాయుడు అంటే విద్యార్థులకు దిక్యూచిలా ఉండాలి. విద్యాబుద్దులు నేర్పించాల్సిన గురువులే కీచక పర్వానికి తెగబడ్డారు. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉపాధ్యాయ వృతికే కళంకం తెచ్చారు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా స్కూల్ ప్రిన్సిపాల్ సహా 9 మంది టీచర్లు.. నలుగురు విద్యార్థినిలపై అత్యాచారానికి తెగబడ్డారు. ఈ దారుణమైన సంఘటన రాజస్థాన్ అళ్వార్ జిల్లా బివాడీ ప్రాంతంలో చోటు చేసుకుంది. తమ సహోద్యోగిని వేధింపుల కేసులో జైలుకు పంపారనే ప్రతీకారంతో ప్రిన్సిపాల్ తో పాటు 9 మంది ఉపాధ్యాయులు నలుగురు విద్యార్థినిలపై అత్యాచారం చేశారు. దీనికి మహిళా ఉపాధ్యాయ సిబ్బంది కూడా సహకరించారు.

లైంగిక వేధింపులకు పాల్పడిన పాఠశాల ఉపాధ్యాయులపై నలుగురు బాలికలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 10వ తరగతి చదువుతున్న ఓ బాధితురాలు తన పాఠశాల ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్‌తో కలిసి ఏడాది పాటు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపించింది. ఉపాధ్యాయులకు సహకరిస్తూ ఇద్దరు మహిళా టీచర్లు వీడియోలు తీశారని ఆమె తెలిపింది. ఈ ఘటన సంబంధించి మూడు వేర్వేరు కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు మందన్ పోలీస్ స్టేషన్ అధికారి ముఖేష్ యాదవ్ తెలిపారు. ప్రిన్సిపాల్‌తో సహా ప్రభుత్వ పాఠశాలలోని ఉపాధ్యాయులపై గ్యాంగ్ రేప్, పోక్సో కేసులు నమోదు చేశారు.

కాగా, ఉత్తరప్రదేశ్‌లో ఓ పాఠశాల నిర్వాహకుడు 17 మంది పదో తరగతి విద్యార్థినులపై అత్యాచారం చేసిన ఘటన వెలుగు చూసి ఒక్క రోజు కూడా కాకముందే రాజస్థాన్‌లో జరిగిన అంతకుమించిన దారుణం ఒకటి బయటపడటం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement