Wednesday, May 15, 2024

బీఆర్కే భవన్ లో కరోనా..61 మందికి వైరస్!

తెలంగాణ తాత్కాలిక సచివాలయం బీఆర్కే భవన్‌ లో కరోనా విలయ తాండవం చేస్తోంది. కరోనాతో తెలంగాణ సచివాలయ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.   ఇప్పటి వరకు  ఏకంగా 61 మంది ఉద్యోగులు, అధికారులు కరోనా వైరస్‌ బారినపడ్డారు. సెకండ్‌ వేవ్‌ లో వైరస్‌ వ్యాప్తి తీవ్రంగా ఉండడంతో సచివాలయంలోని ఉద్యోగులు  ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ కరోనా బారిన పడి.. కోలుకొని విధులకు హాజరవుతున్నారు. ఆయన పేషీలోని పలువురు ఉద్యోగులకూ పాజిటివ్‌ వచ్చింది.

సాధారణ పరిపాలన శాఖలో 12 మంది, నీటిపారుదల శాఖలో ఏడుగురు, ఆర్థిక శాఖలో ఆరుగురు, పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి, అటవీ, గిరిజన సంక్షేమశాఖలో నలుగురు చొప్పున, వైద్యారోగ్యశాఖలో ఐదుగురు, రెవెన్యూ శాఖలో ముగ్గురు, పాఠశాల విద్యలో ఒకరు, విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ లో ఐదుగురు, పురపాలకశాఖలో ముగ్గురు, రోడ్లు భవనాల శాఖలో ఒకరు కలిపి మొత్తం 61 మంది కరోనా బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో రోజూ 50 శాతం మంది ఉద్యోగులనే విధులకు అనుమతించాలని ఉద్యోగులు కోరుతున్నారు. సచివాలయంలోని డిస్పెన్సరీలో కరోనా పరీక్షలకు ఏర్పాట్లు చేయాలని అంటున్నారు.

కాగా, ఏపీ సచివాలయంలో వైరస్‌ బారిన  పడి ఇప్పటికే ముగ్గురు ఉద్యోగులు చనిపోయారు. ఏపీలో ఉద్యోగ జేఏసీ కూడా వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌కు పట్టుబడుతున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement