Sunday, April 28, 2024

Hyderabad: నవరాత్రోత్సవాల్లో లుచ్చాగాళ్లు.. షీటీమ్స్​కి అడ్డంగా దొరికిన దగుల్బాజీలు!

గణపతి నవరాత్రి ఉత్సవాల్లో లంబోదరుడిని దర్శనానికి వచ్చిన ఆడాళ్లను ఆ రకంగా చూస్తూ.. వారిని వెంబడించి, వేధింపులకు గురిచేసిన లఫూట్​గాళ్లు హైదరాబాద్​ షీటీమ్స్​కి​ అడ్డంగా బుక్కయ్యారు. ఇట్లాంటి లుచ్చాగాళ్లు ఉంటారనే సిటీ పోలీసులు ముందస్తుగా మష్టీలో పలు చోట్ల పహారా కాశారు. అంతేకాకుండా సీసీ టీవీ నిఘాకూడా ఏర్పాటు చేశారు. దీంతో దాదాపు 240 మంది షీటీమ్స్​కి చిక్కి ఇప్పుడు కటకటాల వెనక చిప్పకూడు తింటున్నారు.

– డిజిటల్​ మీడియా, ఆంధ్రప్రభ

గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా దర్శనానికి వచ్చిన మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన 240 మంది వ్యక్తులను షీ టీమ్స్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాయి. అరెస్టయిన వారు మహిళలను అనుచితంగా తాకడం, వారిని వెంబడించడం, నగరంలోని గణేష్ మండపాల దగ్గర ఫొటోలు తీస్తున్నట్లు గుర్తించారు. అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (క్రైమ్స్ & సిట్) ఏఆర్ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని అన్ని గణేష్ మండపాల వద్ద హైదరాబాద్ షీ టీమ్స్​ మష్టీలో పోలీసులను పహారాకు పెట్టింది.

గణేష్ ఉత్సవాల్లో మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడం, ఉద్దేశపూర్వకంగా తాకడం, వేధింపులకు గురిచేస్తున్న 240 మందిని రహస్య కెమెరాలతో మఫ్టీలో (సాదా దుస్తులు) ఉన్న షీ టీం సభ్యులు వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. తగిన ఆధారాలతో నిందితులను నాంపల్లి కోర్టులో హాజరుపరచగాట్రయల్ కోర్టు వారికి రూ.250 జరిమానా, 2 నుండి 10 రోజుల వరకు జైలు శిక్ష విధించింది.

“ఎక్కడ ఉన్నా, ఎంత పెద్ద జనం వచ్చినా షీ టీమ్‌ల కళ్ల నుండి తప్పించుకోవడం అంత తేలిక కాదు, ఆడవారితో అసభ్యకరంగా ప్రవర్తించే మీ అనైతిక చర్యలు దాచగలము అనుకుంటే అది మీ అజ్ఞానం. హైదరాబాద్” అని అడిషనల్​ సీపీ శ్రీనివాస్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement