Friday, May 3, 2024

గెలుపు ఊపుతో భారత్‌.. సిరీస్‌పై కన్నేసిన సౌతాఫ్రికా, రేపు రాజ్‌కోట్‌లో నాల్గో టీ20..

ప్ర‌భ‌న్యూస్ : ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా రాజ్‌కోట్‌లో శుక్రవారం జరుగనున్న నాల్గో మ్యాచ్‌పైనే ఉత్కంఠ నెలకొంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో అద్భుత విజయం సాధించిన పర్యాటక దక్షిణాఫ్రికా జట్టు ఈ మ్యాచ్‌లో గెలిచి, సిరీస్‌ కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో బరిలోకి దిగనుంది. విశాఖలో జరిగిన మూడో మ్యాచ్‌లో ఘనవిజయం సాధించిన టీమిండియా అదే జోరు కొనసాగించాలని ఉవ్విళ్లూరుతోంది. తద్వారా సిరీస్‌పై ఆశలను సజీవంగా టీమిండియా బరిలోకి దిగనుంది. మూడో టీ20లో రాణించినట్లు బౌలర్లు సమిష్టిగా రాణిస్తే, మంచి ఫలితాలు వస్తాయని అభిప్రాయం వ్యక్తమవుతోంది. టాస్‌ గెలవడం కంటే… బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌లో సమష్టిగా రాణించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. తొలి టీ20 మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ దిగి 211 పరుగుల భారీ స్కోరు చేసిన విషయం తెలిసిందే. అయితే బౌలింగ్‌లో విఫలం కావడంతో ప్రత్యర్థి సఫారీ జట్టు ఇంకా ఐదు బంతులుండగానే 212 లక్ష్యఛేదన చేసి గెలుపొందింది. రెండో మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో విఫలమై, బౌలింగ్‌లో రాణించినా ఓటమిని చవిచూసింది. ఇలాంటి తప్పిదాలకు తావివ్వకుండా, విశాఖలో రాణించినట్లే సమష్టిగా రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బ్యాటింగ్‌కు సంబంధించి మిడిలార్డర్‌లో మంచి ఇంప్రూవ్‌ ఉందని కెప్టెన్‌ రిషబ్‌పంత్‌ పేర్కొన్నారు. ఓపెనర్లు రుతురాజ్‌, గైక్వాడ్‌, ఇషాన్‌ కిషన్‌ అద్భుతంగా శుభారంభాన్ని అందిస్తున్నారని పేర్కొన్నారు.

శ్రేయాస్‌ అయ్యర్‌, హార్దిక్‌ పాండ్యా బ్యాటింగ్‌ తీరు మెరుగుపడిందని, నాల్గో మ్యాచ్‌లోనే అదే ఒరవడి కొనసాగుతుందని కెప్టెన్‌ రిషబ్‌పంత్‌, ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ గురువారంనాడిక్కడ మీడియా సమావేశంలో ఆశాభావం వ్యక్తం చేశారు. నాల్గో మ్యాచ్‌లో తప్పక నెగ్గుతామని ధీమా వ్యక్తం చేశారు. ఇక దక్షిణాఫ్రికా విషయానికొస్తే… బ్యాటింగ్‌లోనూ, బౌలింగ్‌లోనూ అద్భుత ప్రతిభ కనబరిచారు. జట్టు పరంగా చూస్తే, టీమిండియా కంటే అనుభవం ఉన్న వారు సఫారీ జట్టులో ఎక్కువ మంది ఉన్నారు. టీమిండియా జట్టులో యువకులకు అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో తమ సత్తా ఏమిటో నిరూపించుకుంటున్నారు. అది విశాఖ మ్యాచ్‌లో స్పష్టంగా వెలుగుచూసింది. యుజ్వేందర్‌ చాహల్‌తో పాటు అక్సర్‌ పటేల్‌, హర్షల్‌ పటేల్‌, అవేద్‌ ఖాన్‌ అద్భుతంగా రాణించారు. లైన్‌ అండ్‌ లెంగ్త్‌ బంతులతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్లను కట్టడి చేసి సత్ఫలితాలు సాధించారు. సౌతాఫ్రికా జట్టులో ఫాస్టెస్‌ బౌలర్‌ ఎన్రిచ్‌ నోర్ట్‌జీ 150 కి.మీ. వేగంతో బంతులు వేసి, టీమిండియా బ్యాట్స్‌మెన్‌లకు చుక్కలు చూపించాడు. మూడు మ్యాచ్‌ల్లో పేసర్‌ కేవలం 3 వికెట్లు తీసినప్పటికీ, పరుగులు చేయకుండా బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయడంలో సఫలీకృతుడయ్యాడు. ఇక జట్టులో ఎటువంటి మార్పులు ఉండకపోవచ్చని కెప్టెన్‌ బవుమా వెల్లడించాడు. అటు టీమిండియా జట్టులోనూ ఎలాంటి మార్పులు లేవు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement