Wednesday, May 15, 2024

స్కాట్లాండ్ మ‌టాష్‌… 6.3 ఓవర్లలోనే మ్యాచ్ ఫినిష్ చేసిన టీమిండియా

టీమిండియా ఆటగాళ్లు విధ్వంసక ఆటతీరు కనబర్చారు. దుబాయ్ లో స్కాట్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో ఘన విజ‌యం సాధించింది. స్కాట్లాండ్ మొదట బ్యాటింగ్ చేసి 17.4 ఓవర్లలో 85 పరుగులకు ఆలౌట్ కాగా… 86 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 6.3 ఓవర్లలోనూ ఊదిపారేసింది.

ఓపెనర్లు కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ విధ్వంసక ఆటతీరుతో స్కాట్లాండ్ బౌలర్లను ఆడుకున్నారు. రాహుల్ 19 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 50 పరుగులు చేయగా, రోహిత్ శర్మ 16 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్ తో 30 పరుగులు నమోదు చేశాడు. వీరిద్దరూ అవుటైనా కెప్టెన్ కోహ్లీ (2 నాటౌట్), సూర్యకుమార్ యాదవ్ (6 నాటౌట్) మిగతా పని పూర్తి చేశారు. సూర్యకుమార్ ఓ సిక్స్ తో ఇన్నింగ్స్ కు ముగింపునిచ్చాడు.

ఈ విజయంతో టీమిండియా గ్రూప్-2 పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. ప్రస్తుతం గ్రూప్-2లో అన్ని జట్లు నాలుగేసి మ్యాచ్ లు ఆడాయి. పాక్ జట్టు 4 మ్యాచ్ లు ఆడి 4 విజయాలతో అగ్రస్థానంలో ఉండగా, కివీస్ 4 మ్యాచ్ ల్లో 3 విజయాలు…. భారత్ 4 మ్యాచ్ ల్లో 2 విజయాలు నమోదు చేశాయి.

పాకిస్థాన్ ఇప్పటికే దాదాపుగా సెమీస్ చేరగా, మరో బెర్డు కోసం న్యూజిలాండ్, భారత్ జట్ల మధ్య సమీకరణాల పరంగా పోటీ నెలకొంది. తన చివరి లీగ్ మ్యాచ్ ను న్యూజిలాండ్ జట్టు నవంబరు 7న ఆఫ్ఘనిస్థాన్ తో ఆడాల్సి ఉండగా, ఆ మ్యాచ్ లో న్యూజిలాండ్ ఓడితే భారత్ కు సెమీస్ అవకాశాలు మరింత మెరుగవుతాయి. ఒకవేళ ఆ మ్యాచ్ లో న్యూజిలాండ్ గెలిస్తే భారత్ అవకాశాలకు తెరపడినట్టే. టీమిండియా తన చివరి లీగ్ మ్యాచ్ ను నవంబరు 8న నమీబియాతో ఆడనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement