Thursday, May 2, 2024

నేను తెలంగాణ బిడ్డనే: వైసీపీ ఎమ్మెల్యే

తెలంగాణలోని సిద్దిపేట అభివృద్ధిపై.. కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే శివప్రసాద్​రెడ్డి ప్రశంసలు కురిపించారు.  సిద్దిపేటను అభివృద్ధి చేసిన మంత్రి హరీశ్​రావును ఆదర్శంగా తీసుకొని తన నియోజకవర్గం రూపురేఖలు మారుస్తానని తెలిపారు. సిద్దిపేట పట్టణంలో పర్యటించిన ఎమ్మెల్యే శివప్రసాద్​రెడ్డి.. పట్టణంలోని నిర్మించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్​ను పరిశీలించారు. మార్కెట్లో దుకాణదారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. డబుల్ బెడ్​రూం ఇళ్లను సందర్శించారు.   

అనంతరం మీడియాతో అసక్తికరంగా మాట్లాడారు. తెలంగాణ ప్రాంతం అంటే రాయలసీమకు చాలా ఇష్టమన్నారు. తెలంగాణ, రాయలసీమ కవల పిల్లలని, రెండు ప్రాంతాల జీవన విధానాలు ఒక్కేటేనన్నారు. తెలంగాణ ప్రాంతం ప్రేమకు, పౌరుషానికి పుట్టినిల్లు అని చెప్పారు. తాను తెలంగాణ ప్రాంతానికి చెందిన బిడ్డనేనని చెప్పారు. తాను ప్రతిరోజూ తెలంగాణ ప్రాంతానికి చెందిన పాటలు విన్నా తర్వాతనే నిద్రిస్తానని తెలిపారు. వైఎస్ తర్వాత కేసీఆర్ అంటే తనకు అభిమానం అని, ఆయన ప్రసంగాలు ఇష్టమన్నారు. కెసిఆర్ పట్ల జగన్ కు అపార నమ్మకం అని పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల మధ్య ఇచ్చి పుచ్చుకునే విధానం బాగుందన్నారు. మంత్రి హరీష్ రావు మాస్ లీడర్ అని శివప్రసాద్​రెడ్డి వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement