Sunday, May 5, 2024

Wrestlers Case – లైంగిక వేధింపుల‌పై ఆధారాలున్నాయి….కోర్టు కి రండి.. బ్రిజ్ భూష‌ణ్ కు స‌మ‌న్లు ..

న్యూఢిల్లీ: మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ చీఫ్‌ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ నెల 18న కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు సంబంధించి బ్రిజ్‌ భూషణ్‌ను విచారించేందుకు తగిన ఆధారాలు ఉన్నాయని ఢిల్లీలోని రోజ్ అవెన్యూ కోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో విచారణ కోసం కోర్టుకు రావాలంటూ ఆయనకు సమన్లు జారీ చేసింది. కాగా, బీజేపీ ఎంపీ, రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ చీఫ్‌ బ్రిజ్ భూషణ్‌ తమను లైంగికంగా వేధించినట్లు పలువురు మహిళా రెజ్లర్లు ఆరోపించారు. దీనిపై ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందించలేదని విమర్శించారు.

ఈ నేపథ్యంలో ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద రెండోసారి కూడా కొన్ని రోజుల పాటు నిరసనకు దిగారు. మరోవైపు రెజర్లు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. దీంతో సర్వోన్నత న్యాయస్థానం జోక్యం చేసుకుంది. బ్రిజ్‌ భూషణ్‌పై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు దిగివచ్చారు. జూన్‌ 2న పలు సెక్షన్ల కింద బీజేపీ ఎంపీపై రెండు కేసులు నమోదు చేశారు. జూన్‌ 15న ఛార్జిషీట్‌ కూడా ఫైల్‌ చేశారు. లైంగిక వేధింపులు, నేరపూరిత బెదిరింపులు వంటి అభియోగాలను అందులో పేర్కొన్నారు. దీనిపై విచార‌ణ కోసం బ్రిజ్ భూష‌ణ్ కోర్టు నోటీసులు జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement