డబ్ల్యూపీఎల్ రెండో సీజన్ లో భాగంగా ఇవ్వాల జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రఫ్ఫాడించింది. బెంగళూరులోని చిన్న స్వామి మైదానంలో జరిగిన ఈ మ్యాచ్లో యూపీ వారియర్స్పై విజయం సాధించింది. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో రెండు పరుగుల తేడాతో గెలుపొందింది.
కాగా, టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు బాదింది. టాపార్డర్ విఫలమైనా మిడిలార్డర్ రాణించడంతో భారీ స్కోర్ చేసింది. రీచా ఘోష్(62), తెలుగమ్మాయి సబ్బినేని మేఘన (53)లు హాఫ్ సెంచరీలతో కదం తొక్కారు. యూపీ బౌలర్లలో రాజేశ్వరీ గైక్వాడ్ రెండు వికెట్లు తీసింది.
ఇక 158 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూపీ వారియర్స్ జట్టు 7 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసి రెండు పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఆ జట్టులో గ్రేస్ హారిస్ (38), శ్వేతా సెహ్రావత్ (31) అత్యధిక పరుగులు చేశారు. మిగతా బ్యాటర్లు రాణించలేకపోయారు. ఆర్సీబీ బౌలర్లలో ఆశా శోభన 5 వికెట్లతో మెరిసింది. సోఫీ మోలినెక్స్, జార్జియా వేర్హామ్ చెరో వికెట్ తీశారు.