Sunday, April 28, 2024

మోదీపై పోటీ చేస్తా : దిగ్విజయ్ సింగ్

లోక్‌సభ ఎన్నికల్లో వారణాసిలో ప్రధాని మోదీపై పోటీ చేసేందుకు తాను సిద్దంగా ఉన్నానని కాంగ్రెస్ సీనియర్ నేత‌ దిగ్విజయ్ సింగ్ అన్నారు. అలాగే.. మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌పై రాష్ట్రంలోని విదిషాలో కూడా పోటీ చేయాలని ఉందని అన్నారు. మీడియాతో మాట్లాడుతూ ప‌లు విష‌యాల‌ను డిగ్గీ రాజా షేర్ చేసుకున్నారు. ‘‘నరేంద్ర మోడీ, శివరాజ్ సింగ్ చౌహాన్‌ను ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నా. కానీ, పార్టీ నన్ను రాజ్ గఢ్ నుంచి పోటీ చేయాలని కోరింది.

అందుకే ఇక్కడి (రాయ్ గఢ్) నుంచి బరిలో ఉంటా. ’’ అని డిగ్గీ రాజా అన్నారు. పదేళ్లు (1993-2003) సీఎంగా ఉన్నప్పటికీ దిగ్విజయ్ రాష్ట్ర రాజధాని భోపాల్ నుంచి ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయడం లేదని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ప్రశ్నించిన మరుసటి రోజే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

అధికారికంగా ప్ర‌క‌టించ‌ని కాంగ్రెస్‌..

కాగా.. లోక్‌స‌భ ఎన్నికల్లో తన అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదని, అయితే రెండుసార్లు ప్రాతినిధ్యం వహించిన రాజ్ గఢ్ స్థానం నుంచి తనను బరిలోకి దింపవచ్చని పార్టీ సంకేతాలు ఇచ్చిందని దిగ్విజయ్ సింగ్ అన్నారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో భోపాల్ నియోజకవర్గం నుంచి చేశారు. కానీ, బీజేపీ అభ్యర్థి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ అక్కడ విజయం సాధించారు.

ఇక‌.. దిగ్విజయ్ 1991లో రాజ్ గఢ్ నుంచి పోటీ చేశారు. 1993లో సీఎం అయ్యారు. త‌ర్వాత 1994లో ఆ లోక్ సభ స్థానానికి వచ్చిన ఉప ఎన్నికల్లో ఆయన సోదరుడు లక్ష్మణ్ సింగ్ గెలుపొందారు. 2004 వరకు ఆయనే అక్కడి నుంచి ఎంపీగా ఉన్నారు. కానీ 2003లో లక్ష్మణ్ సింగ్ బీజేపీలో చేరారు. తరువాత వచ్చిన ఎన్నికల్లో దిగ్విజయ్ సన్నిహితుడు, కాంగ్రెస్ నేత నారాయణ్ సింగ్ అమ్లాబే లక్ష్మణ్ సింగ్ ను ఓడించారు. ఆ తర్వాత లక్ష్మణ్ సింగ్ తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement