Friday, May 3, 2024

WHO | అబుదాబిలో ‘మెర్స్‌’ కలకలం..

కరోనా వైరస్‌ జాతికి చెందిన ప్రాణాంతక మెర్స్‌-కోవ్‌ (మిడిల్‌ ఈస్ట్‌ రెస్పిరేటరీ సిండ్రోమ్‌) కలకలం రేపుతోంది. అబుదాబీలో ఓ యువకుడిలో ఈ వైరస్‌ను గుర్తించారు. దీన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఒ) కూడా నిర్ధారించింది. అయితే, అతడికి సన్నిహితంగా మెలిగిన వారిలో ఎవరికీ ఈ వైరస్‌ సోకలేదని తేలింది. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లోని అల్‌ఐన్‌ నగరానికి చెందిన ఓ వ్యక్తి ఇటీవల అనారోగ్యానికి గురయ్యాడు. అతడికి పీసీఆర్‌ పరీక్షలు జరపగా మెర్స్‌-కోవ్‌గా నిర్ధారణ అయింది.

అతడితో పాటు సన్నిహితంగా మెలిగిన 108 మందిని పరీక్షించారు. వారిలో వైరస్‌ జాడలు కనిపించలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. దీంతో ఒంటెల వంటి జంతువుల నుంచే ఇది సోకి ఉండవచ్చని అనుమానించారు. అయితే, ఇన్‌ఫెక్షన్‌ బారిన పడిన ఈ వ్యక్తి ఒంటెలతో సమీపంగా మెలిగిన దాఖలాలు లేవని సమాచారం. మరోవైపు ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితిపైనా డబ్ల్యూహెచ్‌వో, యూఏఈ ఆరోగ్యశాఖ నుంచి ఎటువంటి ప్రకటనా రాలేదు.

- Advertisement -

ది మిడిల్‌ ఈస్ట్‌ రెస్పిరేటరీ సిండ్రోమ్‌ కరోనావైరస్‌ 2012లో సౌదీ అరేబియాలో బయటపడింది. ఇప్పటివరకు ఈ వైరస్‌ బ్రిటన్‌, అమెరికాతో సహా 27 దేశాల్లో వెలుగు చూసింది. అత్యంత ప్రాణాంతకమైన ఈ వైరస్‌ సోకిన బాధితుల్లో 35శాతం మంది మరణించారు. మొత్తంగా ఇప్పటివరకు 2605 కేసులు నమోదు కాగా 936 మరణాలు చోటుచేసుకున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement