Thursday, May 2, 2024

వాట్సప్ స్టేటస్ లు బాధ్యతాయుతంగా ఉండాలి.. ఉల్లంఘిస్తే జైలుకే : హైకోర్టు

వాట్సాప్ స్టేటస్ కూడా ఓ రకమైన సమాచార వ్యాప్తి వ్యవస్థే అని బాంబే హైకోర్టు నాగ్ పూర్ బెంచ్ తెలిపింది. ఓ వర్గానికి వ్యతిరేకంగా ద్వేషపూరిత వ్యాఖ్యలతో స్టేటస్ పోస్ట్ చేసిన ఒక వ్యక్తిపై నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును కొట్టివేసేందుకు నిరాకరించింది. ఈ ఏడాది మార్చిలో మహారాష్ట్రకు చెందిన కిశోర్ లాండ్కర్ అనే వ్యక్తి వాట్సాప్ స్టేటస్ లో ఓ ప్రశ్న వేస్తూ… అందుకు సమాధానాన్ని గూగుల్ లో వెతకాలని కోరాడు.

అందులో ఊహించని నిజాలు తెలుస్తాయని పేర్కొన్నాడు. ఆయన చెప్పిన విధంగానే గూగుల్ లో వెతికిన ఓ వ్యక్తికి అభ్యంతరకర వీడియోలు కనిపించాయి. అవి కొన్ని వర్గాల ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కిశోర్ పై కేసులు నమోదయ్యాయి.

వాట్సప్ స్టేటస్ ఆధారంగా తనపై అట్రాసిటీ కేసును నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ కిషోర్ బాంబే హైకోర్టులో అప్పీల్ చేశాడు. ఈ పిటిషన్ ను విచారించిన కోర్టు తీర్పును వెల్లడించింది. పరిచయస్తులకు ఏదైనా చెప్పాలని భావించినప్పుడే సాధారణంగా వాట్సాప్ స్టేటస్ పెడుతుంటారని తెలిపింది. పౌరులు పెట్టే వాట్సప్ స్టేటస్ లు బాధ్యతా యుతంగా ఉండాలని విద్వేషాన్ని వ్యాప్తి చేసేలా ఉండకూడదని వ్యాఖ్యానించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement