Sunday, May 5, 2024

టెట్‌, టీఆర్టీలో వెయిటేజీ మార్కులు కలపాలి.. ప్రభుత్వానికి విద్యావాలంటీర్ల సంఘం విజ్ఞప్తి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: విద్యావాలంటీర్లకు టెట్‌, టీఆర్టీలో 5 మార్కులను వెయిటేజీ కింద కలపాలని తెలంగాణ రాష్ట్ర విద్యావాలంటీర్ల సంఘం డిమాండ్‌ చేసింది. గతంలో 5 మార్కులు కలుపుతామని విద్యాశాఖ అధికారులు హామీ ఇచ్చారని, దాన్ని ఇప్పుడు అమలు చేయాలని సంఘం నేతలు శివలాల్‌, మల్లయ్య ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కార్పొరేట్‌ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులకు ఒక సంవత్సరకాలం తర్వాత జీతం పెరగడంతో పాటు ఉద్యోగ భద్రత, ఈఎస్‌ఐ లాంటి అలవెన్సులు ఉంటాయని, ప్రభుత్వ పాటశాలల్లో పనిచేసే విద్యావాలంటీర్లకు అవి కల్పించకపోవడం బాధాకరమన్నారు. గత పదేళ్లకు పైబడి ప్రభుత్వ బడుల్లో విద్యా బోధనే వృత్తిగా చేసుకుంటూ విద్యార్థులకు బోధిస్తున్నామని పేర్కొన్నారు. ఇన్నేళ్లుగా సర్వీసు చేసిన తమకు త్వరలో జరగబోయే టెట్‌ టీఆర్టీలో 5 మార్కులను కలపాలని వారు ప్రభుత్వానికి కోరారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement