Thursday, May 2, 2024

విశాఖ స్టీల్ ప్లాంట్‌ ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడతాం.. ఎంపీ జీవీఎల్ ప్రశ్నలకు కేంద్రం జవాబు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయడంపై ఉద్యోగుల నుంచి విజ్ఞప్తులు అందినట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎన్‌ఎల్‌‌)ను సెయిల్‌లో విలీనం చేసేందుకు ఉద్యోగ సంఘాల నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు వచ్చాయా, స్టీల్ ప్లాంట్‌ల పెట్టుబడుల ఉపసంహరణపై ఉద్యోగుల విషయంలో తదుపరి చర్యలేంటని బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవంత్ కరాడ్, ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే మంగళవారం సమాధానాలిచ్చారు. ఉక్కు వ్యూహాత్మక రంగం కాదు కాబట్టి విలీనం గురించి ఆలోచించే అవకాశం లేదని భగవంత్ కరాడ్ తెలిపారు.

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతోందని, లావాదేవీల సలహాదారు, న్యాయ సలహాదారు బిడ్డింగ్ ద్వారా వివిధ దశలు పూర్తయ్యాయని ఆయన తెలిపారు. ఆర్‌ఐఎన్‌ఎల్‌లో 5,190 మంది ఎగ్జిక్యూటివ్‌లు, 10,583 మంది నాన్‌ ఎగ్జిక్యూటివ్‌లు పర్మినెంట్‌ ఉద్యోగులుగా పనిచేస్తున్నారని, మరో 16,816 మంది ఉద్యోగులు కాంట్రాక్ట్‌ కార్మికులుగా ఔట్‌సోర్సింగ్ కాంట్రాక్టర్ల ద్వారా పని చేస్తున్నారని ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్‌సింగ్‌ కులస్తే పేర్కొన్నారు. వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణకు ఆర్‌ఐఎన్‌ఎల్‌ యాజమాన్యం వివిధ యూనియన్‌లతో చర్చలు జరిపిందని, మూలధనం కోసం పెట్టుబడుల ఉపసంహరణ ఆవశ్యకతను వెల్లడించిందని కేంద్రమంత్రి చెప్పారు.

శాశ్వత, కాంట్రాక్టు కార్మికుల ప్రయోజనాలను ప్రభుత్వం ఎలా పరిరక్షిస్తుందని ఎంపీ జీవీఎల్ నరసింహారావు ప్రశ్నించగా చట్టబద్ధమైన ఉద్యోగుల సమస్యలను వాటా కొనుగోలు ఒప్పందం నిబంధనలకు అనుగుణంగా సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ప్రైవేటీకరణ వల్ల ఉద్యోగుల్లో నెలకొన్న ఆందోళనలపై దృష్టి పెడతామని కులస్తే తెలిపారు. ఆర్‌ఐఎన్‌ఎల్‌లో 30 వేల మంది ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడేందుకు తాను కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలతో సమన్వయం చేసుకుంటూ వారి ప్రయోజనాలను పరిరక్షించే “విన్-విన్ పాలసీ”ని రూపొందించడానికి వాటాదారులతో మాట్లాడుతున్నానని జీవీఎల్ నరసింహారావు వెల్లడించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement