Monday, April 29, 2024

రాబోయే ఎన్నికల్లో కుప్పంలో లక్ష మెజార్టీ దిశగా పనిచేయాలి : చంద్రబాబు

కుప్పం జూన్ 15(ప్రభ న్యూస్ ): కుప్పంలో రెండవరోజు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన కోలాహలంగాకొనసాగింది. ఉదయం నుండి ఇతర పార్టీల నుండి చేరికలు, తెదేపా శ్రేణులతో సమీక్షాలు, బహిరంగ సభలో పాల్గొని ప్రసంగం చేశారు. బీసీఎన్ కల్యాణ మండపంలో చంద్రబాబు నాయుడు సమక్షంలో కాంగ్రెస్ పార్టీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. సురేష్ బాబు, అతని అనుచరులు టీడీపీలో కండువా కప్పుకొన్నారు. ఇదే సభలో వైసీపీ, ఇతర పార్టీల నుండి వందలాది మంది కార్యకర్తలు టీడీపీలో చేరారు. ఈ సందర్బంగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి కుప్పంలో టీడీపీ జెండా ఎగురుతూనే ఉందన్నారు. కుప్పం నియోజకవర్గం అభివృద్ది కావాలన్నా, మన పిల్లలు భవిష్యత్ బాగుండాల అన్నా టీడీపీనే గెలవాలని ఆయన తెలిపారు. నేడు పార్టీలో చేరుతున్న వారిని మనస్పూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాన‌ని, అందరూ కలిసి వచ్చే ఎన్నికల్లో కుప్పంలో లక్ష మెజార్టీ దిశగా పనిచేయాలని తెలిపారు. అదే విధంగా రాష్ట్రంలో కుప్పం నియోజకర్గం అంటే ఒక గౌరవం ఉందన్నారు. డాక్టర్ సురేష్ బాబు తండ్రి దొరస్వామి నేను ఒకే సారి ఎమ్మెల్యేలయ్యామని తెలిపారు.

సంపద సృష్టించటం ఆ సంపదను పేదలకు పంచడం తెలిసిన పార్టీ టీడీపీ అన్నారు. రాష్టంలో రెండు రూపాయలకే కిలో బియ్యం, పక్కా ఇళ్ల నిర్మాణం, జనతా వస్త్రాలు వంటి సంక్షేమం పధకాలకు నాంది పలికిన పార్టీ టీడీపీ అన్నారు. అదే విధంగా ఐటీనీ అందిపుచ్చుకుని సంపద సృష్టించామని, వైసీపీ నాలుగేళ్ల పాలనలో రాష్ట్రాన్ని నాశనం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నీతి నిజాయితీకి మారు పేరు కుప్పం ప్రజలు, నేడు ఇక్కడ రౌడీలు పేట్రేగిపోతున్నారు, నా దగ్గర మీ రౌడీయిజం చెల్లదని తీవ్రవాదులపై పోరాడిన పార్టీ, రౌడీలను తుదముట్టించిన పార్టీ టీడీపీ అని తెలిపారు. పేదలను ధనికుల్ని చేసే బాధ్యతను తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని తెలిపారు. నాడు దీపం పథ‌కం గ్యాస్ సిలిండర్ లు ఇచ్చాం, కాలేజీ సీట్లలో 33 శాతం మహిళలకు రిజర్వేషన్లు ఇచ్చి మగవారితో సమానంగా ప్రోత్సహించామని చంద్రబాబు గుర్తు చేశారు. అలాగే ఆడిబిడ్డల్ని మహాశక్తిగా రూపొందిచేందుకు మహాశక్తి పథ‌కం తెచ్చామని, ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం మని హామీలు ఇచ్చారు.

అదేవిధంగా 18 నుండి 59 ఏళ్ల మహిళలకు నెలకు రూ. 1500 ఇస్తామని,ఇంట్లో ఎంతమంది చదువకునే పిల్లలుంటే అందరికీ తల్లికి వందనం కింద ఏడాదికి రూ. 15 వేల రూపాయలు ఇస్తామని తెలిపారు.యువతకు రూ. 3 వేల నిరుద్యోగ భృతి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు. అలాగే రైతులకు ఏడాదికి రూ. 20 వేలు అందజేస్తామని, బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకొస్తామన్నారు. అలాగే కుళాయి ద్వారా ప్రతి ఇంటికి మంచినీరు అందిస్తామని తెలిపారు. పేదల్ని ధనికులుగా చేస్తామని తెలిపారు. ఇక్కడ 95 శాతం పూర్తైన హంద్రీనీవా ప్రాజెక్టును పూర్తి చేయలేకపోయారని, అదే నేనుంటే మూడేళ్ల‌లోనే పూర్తి చేసి నీళ్లిచ్చేవాడిని తెలిపారు. అలాగే ద్రవిడ యూనివర్సిటీ ఉద్యోగులకు జీతాలివ్వలేని దుస్దితిలో వైసీపీ ప్రభుత్వం ఉందన్నారు. ఉద్యోగులు పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్తున్నారని, సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే మళ్లీ టీడీపీ గెలవాలని తెలిపారు. ఎన్నికలు మరో 9 నెలలే ఉన్నాయి, మీరంతా ప్రజల కోసం, పార్టీ కోసం పనిచేయండి, మిమ్మల్ని ఆదుకునే బాధ్యత టీడీపీ తీసుకొంటుందని తెలిపారు. గత 35 ఏళ్లలో నియెజకవర్గంలో జరిగిన అభివృద్ది వచ్చే 5 ఏళ్లలో చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఇంచార్జి మునిరత్నం, మున్సిపాలిటీ తెదేపా అధ్యక్షులు రాజ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement