Thursday, April 25, 2024

ధాన్యం కొనుగోలుకు అన్ని చర్యలు చేపట్టాం : మంత్రి పువ్వాడ

ఖమ్మం : రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారి అవసరాలను గుర్తించి వారు అభివృద్ధి చెందాలన్నదే సీఎం కేసీఆర్‌ లక్ష్యమని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం తల్లాడ మండలం మిట్టపల్లి క్లస్టర్ రేజర్ల కొనుగోలు కేంద్రంలో కొనుగోలు ప్రక్రియను ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, కలెక్టర్ వీపీ గౌతమ్ తో కలిసి మంత్రి పువ్వాడ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. రైతులకు కోసం ఏర్పాటు చేసిన ఈ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో సీఎం కేసీఆర్‌ రైతుల సంక్షేమం కోసం ఎంతగానో కృషి చేస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వాల హయాంలో రైతులను పట్టించుకున్న పాపాన పోలేదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతులను అన్ని విధాల ఆదుకుంటున్నారని తెలిపారు.
జిల్లాలో గ‌తంలో కంటే వ‌రి సాగు చాలా పెరిగింద‌న్నారు.

అధికారుల అంచనాల ప్రకారం ఈ సీజ‌న్ లో 5.37 మెట్రిక్ టన్నుల సాగు చేశార‌ని, ఇందులో 4.03 లక్షల టన్నుల ధాన్యాన్ని రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలు తీసుకువచ్చే అవకాశం ఉన్నందున అందుకు అనుగుణంగా ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 230 కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింద‌న్నారు. అవసరాన్ని బట్టి ఇంకా ఆయా కొనుగోలు కేంద్రాలను పెంచుతామని తెలిపారు. పంటలకు గిట్టుబాటు ధర, రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడం వంటి అనేక సంక్షేమ పథకాలను ప్రభుత్వం కల్పిస్తోందని రైతులకు వివరించారు. రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదని తాము పండించిన ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో స్వేచ్ఛ‌గా అమ్ముకోవ‌చ్చు అని, అందుకు అధికారులు అన్ని చర్యలు చేపట్టారని వివరించారు. కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లో రైతులు పండించిన చివరి గింజను ప్రభుత్వమే కొని వారి ఖాతాల్లో నగదును జమ చేసిన విషయం గుర్తు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement