హైదరాబాద్, ఆంధ్రప్రభ : తొలిసారిగా హైదరాబాద్ నగరంలో భూగర్భ మెట్రో తీసుకురానున్నట్లు మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. రెండో దశలో రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు చేపట్టనున్న 31 కి.మీ మెట్రో కారిడార్ విమానాశ్రయం సమీపంలో 2.5 కి.మీ అండర్గ్రౌండ్ మెట్రో నిర్మించనున్నట్లు చెప్పారు. రాయదుర్గం నుంచి విమానాశ్రయం వరకు నిర్మించనున్న మెట్రో కారిడార్కు రూ.6250 కోట్లు ఖర్చవుతుందని, ఈ ఖర్చును పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు. హైదరాబాద్ మెట్రోరైలు ఐదేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా అమీర్పేట్ మెట్రో స్టేషన్ లో మెట్రోరైలు ఐదేళ్ల వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు.
నగరవాసుల నుంచి మెట్రోకు మంచి స్పందన వస్తుందని ఎన్వీఎస్రెడ్డి తెలిపారు. మెట్రోరైల్ అందుబాటులోకి వచ్చిన మొదటిరోజే రెండు లక్షల మంది ప్రయాణించారని వెల్లడించారు. ప్రస్తుతం నిత్యం నాలుగు లక్షల 40వేల మంది మెట్రోలో ప్రయాణిస్తున్నారని వెల్లడించారు. రాయదుర్గం నుంచి ఎయిర్పోర్టుకు వరకు(31కి.మీ) మెట్రో రెండో దశ నిర్మాణానికి డిసెంబర్ 9వ సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తారని తెలిపారు. ప్రస్తుతం ఉన్న మూడు కారిడార్లలో 69.2 కి.మీ మేర మెట్రో నడుస్తోందని ఎల్అండ్టీ కేవీబీరెడ్డి పేర్కొన్నారు. ఈ ఐదేళ్లలో ఇప్పటివరకు హైదరాబాద్ మెట్రోలో 31 కోట్ల మంది ప్రయాణించారని చెప్పారు.