Friday, May 3, 2024

TS | తాగు నీటి సమస్యలపై సీఎస్‌ సమీక్ష..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : రానున్న రోజుల్లో వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రమంతా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా హైదరాబాద్‌ మహానగరంలో సమస్యలు ఉత్పన్నం కాకుండా ముందుజాగ్రత్త చర్యలకు పూనుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశాలు జారీ చేశారు.

ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో జల వనరుల్లో నీటి నిల్వలు తగ్గిపోయే ప్రమాదం ఉందని, అందుబాటులో ఉన్న నిల్వలు, అవసరాలకు మధ్య తేడాలను గుర్తించి జిల్లాల వారీగా ఎన్నటికప్పుడు తనకు నివేదించాలని సూచించారు. వచ్చే నెల రోజుల పాటు రాష్ట్రంలో తాగునీటి సరఫరా పరిస్థితిని నిషితంగా పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. నీటి సరఫరాలో అంతరాయాలు రాకుండా జాగ్రత్త వహించాలన్నారు.

ఈ అంశంపై సోమవారం బీఆర్‌ అంబేద్కర్‌ సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. మున్సిపల్‌, నీటిపారుదల, పంచాయితీ రాజ్‌ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్‌ శాంతికుమారి మాట్లాడుతూ, రాష్ట్రంలో తాగునీటి సరఫరా పరిస్థితిని ముందుగా అంచనా వేస్తేనే సమస్యలు తలెత్తకుండా చూడగలమని అన్నారు.

సరఫరాలో అంతరాయం ఉన్న ప్రాంతాలను గుర్తించి ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాజధాని నగరంలో నీటి పరిస్థితిని ప్రస్తావిస్తూ సంబంధిత సీజీఎంలు ముందస్తు అనుమతితో మాత్రమే నిర్వహణ పనులు చేపట్టాలని, ఆయా ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా ప్రత్యామ్నాయ తాగునీటి సరఫరా చేయాలని ఆదేశించారు. సీజీఎంలు ప్రతిరోజూ తమ పరిధిలోని మేనేజర్‌లతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించి నీటి సరఫరాను పర్యవేక్షించాలన్నారు.

అదే విధంగా మిషన్‌ భగీరథ, పబ్లిక్‌ హెల్త్‌ అధికారులు కూడా నిరంతరం పర్యవేక్షించాలని అన్నారు. నాగార్జునసాగర్‌ నుంచి నీటి పంపింగ్‌ ఇప్పటికే ప్రారంభమైందని, మే నెలాఖరు వరకు రాష్ట్రంలో తాగునీటి సరఫరాకు ఎలాంటి లోటు ఉండదని అధికారులు తెలిపారు. ఉద్దేశపూర్వకంగా కృత్రిమ కొరత సృష్టించే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని సీఎస్‌ అధికారులను హెచ్చరించారు.

- Advertisement -

సీడీఎంఏ డైరెక్టర్‌ దివ్య మాట్లాడుతూ, మంచినీటి సరఫరా పరిస్థితిని ప్రతిరోజూ పర్యవేక్షిస్తున్నామని, లీకేజీలు ఏవైనా ఉంటే వెంటనే సరిచేస్తున్నామని, ప్రతి మున్సిపాలిటీలో హెల్ప్‌ లైన్‌ను ఏర్పాటు చేశామని, నీటి సరఫరాలో చిన్న అంతరాయం ఏర్పడినా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని చెప్పారు.

ఈ సమావేశంలో మున్సిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్‌, పంచాయత్‌ రాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా, ఇరిగేషన్‌ శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్‌ బొజ్జా, ఎండీ హెచ్‌ఎండబ్ల్యూఎస్‌బీ సుదర్శన్‌ రెడ్డి ఇతర ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement