Thursday, April 25, 2024

కాశ్మీరంలో మళ్లి టూరిజం సందడి.. 60 రోజుల్లో 2.5 లక్షల పర్యాటకులు

కఠినమైన శీతాకాలంలో కూడా పర్యాటకులు సుందరమైన కాశ్మీర్‌ను సందర్శించేందుకు మొగ్గుచూపారు. ఈ సంవత్సరం మొదటి రెండు నెలల్లో రికార్డు స్థాయిలో 2.5 లక్షల మంది పర్యాటకులు కాశ్మీర్‌ లోయను సందర్శించారు. బాలీవుడ్‌ కూడా కాశ్మీర్‌కు తిరిగి వచ్చింది. నటులు రణ్‌వీర్‌ సింగ్‌,, అలియా భట్‌ తమ రాబోయే చిత్రం ”రాకీ ఔర్‌ రాణి కి ప్రేమ్‌ కహానీ” కోసం మంచుతో కప్పబడిన గుల్‌మార్గ్‌లో షూట్‌లతో బిజీగా ఉన్నారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గుల్‌మార్గ్‌లోని స్కీ రిసార్ట్‌కి మాత్రమే కాకుండా, దక్షిణ కాశ్మీర్‌లోని పహల్గామ్‌ రిసార్ట్‌కు కూడా పర్యాటకులు పోటెత్తారు. సాధారణంగా ఇది శీతాకాలంలో ఖాళీ ఉంటుంది. కానీ ఈ ఏడాది చెప్పుకోదగ్గ సంఖ్యలో పర్యాటకులు ఇక్కడికి రాకపోకలు సాగించారు.

జనవరిలో 1.27 లక్షల మంది పర్యాటకులు కాశ్మీర్‌ను సందర్శించారు. ఫిబ్రవరిలో 1.29 లక్షల మంది వచ్చారు. ఈ సంవత్సరం పర్యాటక సీజన్‌ బంపర్‌గా ఉంటుందని కాశ్మీర్‌ పర్యాటక అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. గతేడాది ఫిబ్రవరిలో కేవలం 1,63,154 మంది పర్యాటకులు మాత్రమే లోయను సందర్శించారు. ట్రావెల్‌ ఏజెంట్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా కాశ్మీర్‌ చాప్టర్‌ ప్రెసిడెంట్‌ జహూర్‌ అహ్మద్‌ ఖారీ మాట్లాడుతూ, పర్యాటకుల రద్దీ బాగుంది. గుల్మార్గ్‌ స్కీ రిసార్ట్‌ మార్చి చివరి వరకు బుకింగ్‌లు పూర్తిచేసుకుంది. అక్టోబర్‌లో మూసివేసే #హౌస్‌బోట్‌లు ఈ సంవత్సరం చలికాలంలో మంచి ఆక్యుపెన్సీని కలిగి ఉన్నాయి. మలేషియా, థాయిలాండ్‌, ఇండోనేషియా సహా ఆగ్నేయాసియా నుండి విదేశీ పర్యాటకులు కూడా ఈ సంవత్సరం మొదటి రెండు నెలల్లో కాశ్మీర్‌ను సందర్శించారని అహ్మద్‌ ఖారీ చెప్పారు.

2022- 2023 చలికాలంలో లోయలో పర్యాటకుల రద్దీ ఉందని కాశ్మీర్‌ హోటల్స్‌ అండ్‌ రెస్టారెంట్‌ ఓనర్స్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు బషీర్‌ అహ్మద్‌ భట్‌ తెలిపారు. శ్రీనగర్‌లోని హోటళ్లలో ప్రస్తుతం 70-75 శాతం ఆక్యుపెన్సీ ఉందని, ఈ ఏడాది కాశ్మీర్‌కు పూర్తి స్థాయిలో పర్యాటకుల రాకపోకలు వస్తాయని ఆశిస్తున్నామని చెప్పారు. ఈ నెలాఖరు నాటికి శ్రీనగర్‌లో ఆసియాలోనే అతిపెద్ద తులిప్‌ గార్డెన్‌ను ప్రారంభించడంతో పర్యాటకుల రాక మరింత పెరిగే అవకాశం ఉంది. గత సంవత్సరం, 3.65 లక్షల మంది పర్యాటకులతో సహా 2.7 మిలియన్ల మంది పర్యాటకులు లోయను సందర్శించారు. ఇదే సమయంలో బాలీవుడ్‌ కూడా సుందరమైన కాశ్మీర్‌తో మమేకం అవుతోంది. చిత్రనిర్మాతలు సినిమా షూటింగ్‌ల కోసం ఇక్కడకు బారులు తీరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement