Wednesday, May 1, 2024

Delhi: బాండ్ల‌పై నెంబ‌ర్లు ఏవీ… ఎస్బీఐని మ‌ళ్లీ వాయించేసిన సుప్రీంకోర్టు

ఢిల్లీ: ఎలక్టోరల్‌ బాండ్స్ వివరాల వెల్లడి వ్యవహారం స్టేట్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)ని ఇప్పట్లో వదిలేలా లేదు. ఎన్నికల కమిషన్‌ (ఈసీ)కి ఇచ్చిన సమాచారంలో ఎలక్టోరల్‌ బాండ్ల నెంబర్లు ఎందుకు లేవో చెప్పాలని నేటి ఉదయం ఎస్‌బీఐకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తమ ఆదేశాల ప్రకారం బాండ్ల పూర్తి వివరాలు ఎందుకు వెల్లడించలేదని చీఫ్‌జస్టిస్‌ ఆఫ్‌ ఇండియా(సీజేఐ) డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ఐదుగురు జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం ఎస్‌బీఐపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఎన్నిక‌ల సంఘానికి ఎస్‌బీఐ ఇచ్చిన వివరాల్లో ఎలక్టోరల్‌ బాండ్ల నెంబర్లు వెల్లడించకపోవడం వల్ల ఏ కంపెనీ ఏ రోజు ఏ రాజకీయ పార్టీకి ఎంత విరాళమిచ్చిందనే నిర్ధిష్ట సమాచారం లేదు. బాండ్ల వివరాలను ఎన్నికల కమిషన్‌ (ఈసీ) గురువారం బహిర్గతం చేసింది. వాటిలో బాండ్ల నెంబ‌ర్లు లేని విష‌యం వెలుగు చూసింది. ఈ వివరాల్లో ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు అందిన విరాళాల పూర్తిస్థాయి సమాచారం లేదని ప్రతిపక్షాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.

కాగా, ఎన్నికల బాండ్ల స్కీమ్‌ 2018 స్కీమ్‌ను రద్దు చేస్తూ బాండ్ల వివరాలు ఈసీకి అందజేయాలని సుప్రీంకోర్టు ఎస్‌బీఐని ఆదేశించింది. వివరాలందించేందుకు తమకు సమయం కావాలని ఎస్‌బీఐ సుప్రీంకోర్టును కోరగా.. సమయం ఎందుకని కోర్టు బ్యాంకుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈనెల‌ 15లోగా బాండ్ల వివరాలందించాల్సిందేనని స్పష్టం చేసింది. దీంతో ఈసీకి ఎస్‌బీఐ 15న బాండ్ల వివరాలందజేసింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement