Thursday, May 9, 2024

RR | చెరువు ఖాళీ, నీరంతా వృథా.. కాలువకు గేట్ వాల్స్ పెట్టాలి!

శంకర్‌ పల్లి (ప్రభ న్యూస్): రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలంలోని పొద్దటూరు చెరువులో నీళ్లు లేవు. కాలువ నుంచి వ‌చ్చిన కొద్దిపాటి నీళ్లు చెరువులోకి రాకుండా అటు నుంచి అటే మూసీ నదిలోకి వెళ్తున్నాయి. దీంతో రైతులు, గ్రామస్తులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. భారీ వర్షాలు పడ్డా చెరువులోకి నీరు రావడం లేదు. దానికి ప్రధాన కారణం కమ్మేట, గొల్లగూడెం ప్రాంతాల నుండి వచ్చే వరద నీరు చాలా కాలంగా పొద్దుటూరు చెరువు నింపడానికి ఉపయోగించు కునేవారు. కానీ, గత ఏడాది వరద ప్రవాహాన్ని కట్టడి చేసే తూములకున్న గేట్ వాల్స్ కార‌ణంగా ప్రవాహం కాస్త పొద్దుటూరు చెరువులోకి రాకుండా మూసిలోకి వెళ్తోంది.

ఈ విషయాన్ని స్థానిక సర్పంచ్ ఏనుగు నరసింహారెడ్డి పలుమార్లు ఇరిగేషన్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారు ప‌ట్టించుకోలేదు. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా స్పందన లేదు. ఇంత‌లా కుంభవృష్టి కురిసినా చెరువులోకి నీరు రాక‌పోవ‌డం, కళ్ల‌ ముందే ఆ వ‌ర‌ద నీరంతా మూసి వాగులోకి వెళ్తుండ‌డంతో రైతులు ఆవేద‌న చెందుతున్నారు. ఇప్పటికైనా పరిస్థితిని సరిచేయాల్సిన అవసరం ఉంది. ఇరిగేషన్ అధికారులు స్పందించి తూముల కు గేట్ వాల్స్ ఏర్పాటు చేయాలి. నీటి ప్రవాహాన్ని వీలైనంత ఎక్కువగా చెరువులోకి వెళ్ళేటట్లు సెట్ చేయాలి. రాబోయే రోజుల్లో రైతులకు ఇబ్బందులను రాకుండా చూడాల‌ని సర్పంచ్ ఏనుగు నరసింహారెడ్డి కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement