Thursday, April 25, 2024

Big story | ఈసారి ‘ఎండ’ ప్రచండమే.. ఇప్పటినుంచే వెంటాడుతున్న మండుటెండల భయం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : ఈ ఏడాది మండుటెండల భయం ఇప్పటినుంచే పేద వర్గాలను వెంటాడుతోంది. మార్చి నెలలోనే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌ను దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఖగోళ శాస్త్రజ్ఞుల హెచ్చరికల నేపథ్యంలో మండుటెండలపై తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇప్పటి నుంచే భయాందోళన చెందుతున్నారు. పచ్చదనం ఉట్టిపడే కేరళలో కూడా ఈ ఏడాది వేసవి ప్రారంభం కాకముందే ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోయాయి. దేశమంతా ఈ ఏడాది ఎండల విపత్తు తప్పదని వాతావరణ శాఖ ముందస్తు అంచనాలతో హెచ్చరికలు చేస్తున్న నేపథ్యంలో నిత్యం కూలీ పనులకు వెళ్ళేవారు, భవన నిర్మాణరంగ కార్మికులు, ఉపాధి కూలీలకు గడ్డుకాలమేనన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఎండల తీవ్రత కారణంగా గోవాలో పాఠశాలలను ఈ నెల ప్రారంభం నుంచే ఒంటిపూట నిర్వహిస్తున్నారు. గోవాలో గత రెండు రోజులుగా ఎండ వేడి పెరిగింది. వేసవిలో ఎండ 45 డిగ్రీలు దాటితేనే జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతారు.

రాబోయే రోజుల్లో వేడి గాలులు మరింత పెరిగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. పలు ప్రాంతాల్లో మార్చిలోనే 50 డిగ్రీల ఉష్ణోగ్రతకు చేరే అవకాశం ఉన్నట్లు అభిప్రాయపడింది. కేరళ రాష్ట్రంలో ఎండల తీవ్రత అధికంగా ఉంది. తిరువనంతపురం, కొల్లం, అలప్పుజా, కొట్టాయం, ఎర్నాకులం, కోజికోడ్‌, కన్నూర్‌లోని ప్రధాన ప్రాంతాలలో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆ ప్రాంతాల్లో వేసవిలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఎన్నడూ 40 నుంచి 45 డిగ్రీలకు మించవు. ప్రజలు బయటికి వెళ్లేటప్పుడు మరింత జాగ్రత్త వహించాలని, ఎండ నుంచి రక్షించుకోవడంతో పాటు ఎక్కువ నీళ్లు తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. దేశంలో 2022 జనవరి1 నుంచి సెప్టెంబర్‌ 30 వరకు 273 రోజుల్లో 241 రోజులు తీవ్రమైన వాతావరణ ఉత్పాతాలు సంభవించాయి. వడగాల్పులు, శీతల గాలులు, తుఫానులు, మెరుపులు, భారీ వర్షాలు, కరువు, వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటివి అందులో ఉన్నాయి.

- Advertisement -

ఢిల్లీకి చెందిన సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్మెంట్‌ అండ్‌ డౌన్‌ టు ఎర్త్‌ (డీటీఈ) విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ఇదే కాలంలో మధ్యప్రదేశ్‌లో ప్రతి రెండో రోజు ఒక ఘటన జరిగింది. తెలంగాణలో 41 నమోదైతే, ఏపీలో 45 ఉత్పాతాలు సంభవించాయి. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం అంచనాలు ఉన్నా, వాటిపై పూర్తిగా సర్వే చేయలేదు. తెలంగాణాలో అధిక వర్షాలతో వచ్చిన వరదలు గోదావరి ప్రాంతంలో కనీసం15 లక్షల ఎకరాల పంటను ముంచెత్తాయి. తెలంగాణ ప్రభుత్వం ఆయా ప్రాంతాల్లో జరిగిన నష్టాల మీద అధ్యయనం చేయలేదు. రైతులను పట్టించుకోలేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన పరిహారం గురించి ప్రయత్నం కూడా చేయలేదు. ఈ ప్రకృతి వైపరీత్యాలు ఎప్పుడు, ఏ రూపంలో, ఎంత తీవ్రతతో వచ్చి పడతాయో తెలియని పరిస్థితి నెలకొంది.

వరుస ఉత్పాతాల భయం..

దేశంలో సంభవిస్తున్న వరుస ఉత్పాతాలు భూమిపై వాతావరణ మార్పునకు సూచికలు. ఇదివరకు వందేండ్లలో వచ్చిన మార్పుగా భావిస్తే, ఇప్పుడు ఇటు-వంటి తీవ్రమైన వాతావరణ ఉత్పాతాలు ఐదేండ్లలో ఒకటి లేదా అంతకంటే తక్కువ కాలంలోనే చూస్తున్నాం. క్రిస్టియన్‌ ఎయిడ్‌ అనే సంస్థ వాతావరణ సంక్షౌభంతో ప్రభావితమైన 2022లో ప్రపంచంలో10 భారీ నష్టం కలిగించిన తీవ్ర వాతావరణ ఉత్పాతాలను ఒక అధ్యయనంలో గుర్తించింది. ప్రతీది రూ.25 వేల కోట్లకు పైగా నష్టాన్ని కలిగించింది. ఈ నివేదిక పేద దేశాల్లో భారీ ప్రాణ, పర్యావరణ నష్టాన్ని కలిగించిన10 ఇతర తీవ్రమైన వాతావరణ ఉత్పాతాలను కూడా పరిశీలించింది. పాకిస్తాన్‌ లో మొన్న జూన్‌లో కొన్ని ప్రాంతాలను ముంచెత్తిన వరదలు 1700 మంది ప్రాణాలను తీసి, 70 లక్షల మందిని నిర్వాసితులను చేశాయి.

30 బిలియన్‌ డాలర్ల కంటే ఎక్కువ నష్టాన్ని కలిగించాయి. సెప్టెంబర్‌ లో అమెరికా, క్యూబాలను తాకిన హరికేన్‌ ఇయాన్‌ 100 బిలియన్‌ డాలర్లు, బ్రిటన్‌, యూరప్‌ ను నాశనం చేసిన వేసవి వడగాల్పులు, కరువు 20 బిలియన్‌ డాలర్ల నష్టాలను మిగిల్చాయి. వరదలు, తుఫానులు, కరువుల వల్ల ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ప్రజలు చనిపోయారు. నిరుడు ఈజిప్ట్‌ లో జరిగిన కాప్‌-27లో నష్ట పరిహారం గురించిన ఒప్పందం గురించి త్వరగా నిర్ణయాలు తీసుకోవాలని ఈ నివేదిక అన్ని దేశాలను కోరింది.

పేద వర్గాలపైనే తీవ్ర ప్రభావం..

బొగ్గు, పెట్రోల్‌, డిజిల్‌ వంటి శిలాజ ఇంధనాల ఉపయోగం నుంచి వెలువడిన కాలుష్యం వల్ల ఈ ప్రకృతి విపత్తులు వేగంగా దూసుకొస్తున్నాయి. వాటి వాడకం తగ్గిస్తామని ప్రతి దేశం స్వతహాగా లక్ష్యాలు ప్రకటించాయి. అంతర్జాతీయ ఖగోళ, పర్యావరణ శాస్త్రవేత్తల అధ్యయనాల ప్రకారం ఈ లక్ష్యాలు సరిపోవు. 2015లో జరిగిన పారిస్‌ ఒప్పందం ఉష్ణోగ్రత పెరుగుదలను పారిశ్రామిక పూర్వ స్థాయిలతో పోలిస్తే1.5 డిగ్రీల సెల్సియస్‌ కంటే తక్కువగా ఉంచాలనే లక్ష్యాన్ని నిర్దేశించింది. కానీ, ఈజిప్టులో జరిగిన కాప్‌-27 వాతావరణ శిఖరాగ్ర సమావేశం నుంచి ఈ దిశగా చర్చ జరగలేదు. అన్ని దేశాలు అత్యవసర చర్యలు తీస్కోవాల్సిన అవసరం 2022లో జరిగిన వరుస ఉత్పాతాలు గుర్తు చేస్తున్నా, దేశాధినేతలు కదలకపోవడం విస్మయం కలిగిస్తున్నది.

వాతావరణ మార్పుల కారణంగా అసాధారణమైన ఆర్థిక, సామాజిక నష్టాలు ఎదురవుతున్నాయి. సాధారణ ప్రజలు అనేక అనారోగ్య పరిస్థితులను నిత్య జీవనంలో ఎదుర్కొంటు-న్నారు. వారిని ఆదుకునే స్థితిలో అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రభుత్వాలు లేవు. అందుకు పాక్‌ ఒక ఉదాహరణ. గత ఏడాది వరదల బీభత్సంతో తీవ్రంగా నష్టపోయిన ప్రజలకు, ఆయా ప్రాంతాల్లో కోల్పోయిన మౌలిక సదుపాయాల నష్టానికి సంబంధించి పాకిస్తాన్‌ ప్రభుత్వం ఏమి చేయలేని దుస్థితిలో ఉంది. ఇతర దేశాల నుంచి వచ్చిన సాయం అరకొర మాత్రమే.

కేంద్రం దృష్టి పెట్టాల్సిందేనంటున్న నిపుణులు..

ఇప్పటికే ప్రపంచ ఆహార భద్రతను అనేక భౌగోళిక పరిస్థితులు బలహీనపరుస్తున్నాయి. కొవిడ్‌19, భౌగోళిక రాజకీయ, శక్తి, జీవన వ్యయ సంక్షౌభాలు ఆహార లేమిని తీవ్రతరం చేస్తున్నాయి. 1981- 2010 సగటుతో పోలిస్తే 2020లో 9.8 కోట్ల ప్రజలు మితమైన లేదా తీవ్రమైన ఆహార అభద్రతతో బాధపడుతున్నారని ఇటీవలి లాన్సెట్‌ కౌంట్‌ డౌన్‌ 2022 నివేదిక తెలిపింది. 2022 నాటి వడగాల్పులు, కరువు వంటి తీవ్రమైన సంఘటనలతో ఆహార భద్రతపై ఒత్తిడి మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. రెండేండ్లుగా ప్రపంచవ్యాప్తంగా మనం చూసిన తీవ్ర వాతావరణ ఘటనలు అంతర్జాతీయ సమాజానికి మేల్కొలుపుగా ఉండాలి.

ఐరోపా, అమెరికా, చైనా దేశాల్లో భారీ మంచు, వరదలు, కొండచరియలు విరిగిపడటం, తీవ్ర వడగాల్పులు అక్కడి ప్రజలను ఒత్తిడికి గురి చేస్తున్నాయి. అక్కడి రాజకీయ వ్యవస్థ ఈ ఒత్తిడితో అలజడి స్థితిలో ఉంది. ఆశ్చర్యంగా, భారత దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ నాయకులకు, పార్టీలకు ఇవేమీ పట్టడం లేదు. వారు ఈ ఉత్పాతాలను సాధారణంగా పరిగణిస్తున్నారు. రాబోయే వేసవిలో ఎండలు విపరీతంగా ఉండవచ్చనే హెచ్చరికల నేపథ్యంలో భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను జాగరూకులను చేస్తూ, ఉపశమన చర్యలకు ముందస్తు ప్రణాళికలు తయారు చేయాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement