Friday, April 26, 2024

బీజేపీ దుశ్చర్యకు పరాకాష్ట.. రాహుల్ అనర్హతపై బీఆర్ఎస్ ఎంపీ నామా

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: రాహుల్ గాంధీపై అనర్హత వేటు కేంద్ర ప్రభుత్వ దుశ్చర్యకు పరాకాష్ట అని బీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసిన ఆయన కేంద్ర ప్రభుత్వ అక్రమాలను ప్రశ్నిస్తారనే భయంతోనే రాహుల్ గాంధీపై అనర్హత వేటు  వేశారన్నారు. ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ విలువలకు కేంద్రం తిలోదాకాలిచ్చిందని మండిపడ్డారు. భారత దేశ చరిత్రలో ఇదొక చీకటి రోజు అని ఆయన అభివర్ణించారు. బీజేపీ దుశ్చర్యను ప్రజాస్వామ్యవాదులంతా తీవ్రంగా ఖండించాలని నామా పిలుపునిచ్చారు. .

దర్యాప్తు సంస్థల అండతో ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని  ఆరోపించారు. పార్లమెంట్ సాక్షిగా ప్రజాస్వామ్యం ఖూనీ చేసే విధంగా కేంద్రం వ్యవహరిస్తోందని ప్రకటనలో పేర్కొన్నారు. బీజేపీ దుర్మార్గాలను ప్రజలు గమనిస్తున్నారని, దేశ ప్రజలు ఆ పార్టీకి తప్పక  తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. ప్రపంచంలోనే అత్యున్నత ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి చర్య దురదృష్టకరమని నామా ఆవేదన వ్యక్తం చేశారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement