Tuesday, May 21, 2024

Nirmal: రైతుల పొట్ట కొట్టేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ ను తరిమికొట్టాలి… మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

నిర్మ‌ల్ ప్రతినిధి, జులై 12 (ప్రభ న్యూస్) : రైతుల పొట్టకొట్టాలనుకున్న కాంగ్రెస్ పార్టీని తరిమికొట్టాలని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. వ్య‌వ‌సాయానికి 3గంట‌ల క‌రెంట్ స‌రిపోతుంద‌ని పీసీసీ చీఫ్  రేవంత్ రెడ్డి చేసిన‌ వ్యాఖ్య‌ల‌పై నిర్మ‌ల్ రైతులు భ‌గ్గుమ‌న్నారు. నిర్మ‌ల్ ప‌ట్ట‌ణంలో క‌రెంట్ కార్యాల‌యం ముందు రోడ్ పై బైఠాయించి కాంగ్రెస్ రైతు వ్య‌తిరేక విధానాల‌ను నిర‌సిస్తూ ధ‌ర్నా నిర్వ‌హించారు. రైతుల‌కు మ‌ద్ధతుగా మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి నిర‌స‌న కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. రైతుల‌తో క‌లిసి ర‌హ‌దారిపై బైఠాయించారు. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీకి వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. అనంత‌రం పీసీసీ చీఫ్ రేవంత్ దిష్టిబొమ్మ ద‌గ్ధం చేశారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి మాట్లాడుతూ…. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ‌లో రైతుల‌కు సీఎం కేసీఆర్ అండ‌గా నిలిస్తే…. కాంగ్రెస్ పార్టీ మాత్రం రైతుల పొట్ట‌కొట్టేందుకు చూస్తుంద‌ని మండిప‌డ్డారు. ఉచిత విద్యుత్ పై రేవంత్ చేసిన వ్యాఖ్య‌ల‌ను బీఆర్ఎస్ తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్న‌ద‌ని తెలిపారు. ఆనాడు టీడీపీ ప్ర‌భుత్వ‌ రైతు వ్య‌తిరేక విధానాల‌పై బ‌షీర్ బాగ్  వ‌ద్ద ఆందోళ‌న చేస్తున్న రైతుల‌పై చంద్ర‌బాబు నాయుడు కాల్పులు జ‌రిపి ముగ్గురిని పొట్ట‌న‌పెట్టుకున్నాడ‌ని, ఇవాళ ఆయ‌న శిష్యుడు రేవంత్ రెడ్డి కూడా ఉచిత క‌రెంట్ వ‌ద్దంటున్నాడ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దేశానికి అన్నంపెట్టే అన్న‌దాత‌లు అంటే  కాంగ్రెస్ పార్టీకి మొద‌టి నుంచి కండ్ల మంటేన‌ని ద్వ‌జ‌మెత్తారు. మొన్న‌నేమో ధ‌ర‌ణి వ‌ద్ద‌న్నార‌ని, ఇప్పుడేమో ఉచిత క‌రెంట్ వ‌ద్ద‌ని కాంగ్రెస్ రైతు వ్య‌తిరేకి పార్టీ అని నిరూపించుకుంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఇలాంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ‌కు అవ‌స‌ర‌మా అని ప్ర‌శ్నించారు. రైతుల‌కు ఉచిత క‌రెంట్ ఎందుక‌న్న కాంగ్రెస్ పార్టీ నాయ‌కుల‌ను గ్రామ పొలిమేర‌ల వ‌ర‌కు త‌రిమికొట్టాల‌ని పిలుపునిచ్చారు. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో రైత‌న్న‌లు కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయ‌డం ఖాయ‌మ‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్సీ దండే విఠ‌ల్, జిల్లా రైతు స‌మ‌న్వ‌య స‌మితి చైర్మ‌న్ వెంక‌ట్రామ్ రెడ్డి, నిర్మ‌ల్ ప‌ట్ట‌ణ బీఆర్ఎస్ ప్ర‌జాప్ర‌తినిధులు, కార్య‌క‌ర్త‌లు, రైతులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement