Thursday, April 25, 2024

మరో 6 లక్షల టన్నుల బియ్యం కొంటాం!

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నలుగుతున్న వరి ధాన్యం సేకరణ పంచాయితీలో కీలక ముందడుగు పడింది. రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గిన కేంద్రం ముందే కుదుర్చుకున్న ఒప్పందానికి అదనంగా ఈ ఖరీఫ్‌ దిగుబడి నుంచి మరో 6 లక్షల మెట్రిక్‌ టన్నుల ముడి బియ్యాన్ని సేకరించేందుకు అంగీకరించింది. ఈ మేరకు కేంద్ర వినియోగ దారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ శాఖ అండర్‌ సెక్రటరీ జై ప్రకాశ్‌ పేరుతో తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్‌, ఎక్స్‌ అఫిషియో కార్యదర్శికి లేఖ రాసింది. వరిధాన్యం (ముడి బియ్యం రూపంలో) సేకరణ కోటాను పెంచాల్సిందిగా కోరుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది సెప్టెంబర్‌ 29న రాసిన లేఖను పరిగణలోకి తీసుకుంటూ అదనంగా 6 లక్షల మెట్రిక్‌ టన్నుల ముడి బియ్యాన్ని సేకరించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్టు పేర్కొంది.

తెలంగాణ ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి పెంచి అదనపు బియ్యం సేకరణ కోటా లిఖితపూర్వకంగా సాధించినా, ఇంకా పెంచాలని ప్రభుత్వవర్గాలు అంటున్నాయి. తెలంగాణ ప్రభుత్వం, మంత్రులు, ఎంపీలు కేంద్రంపై ఎంతో ఒత్తిడి తేగా, ఎట్టకేలకు కదలిక వచ్చింది. అయితే తెలంగాణ కొనుగోలు చేసిన ధాన్యానికి ఇది సరిపోదని, వానాకాలం సేకరించిన ధాన్యం మొత్తం కొనుగోలు చేయాలని, అదే విధంగా యాసంగిలో కూడా పండిన ధాన్యం కొనుగోలు చేయాలని తెలంగాణ ప్రభుత్వవర్గాలు అంటున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement