Tuesday, April 30, 2024

యాసంగి ధాన్యం సేకరణలో తెలంగాణ నెంబర్ వ‌న్‌ : మంత్రి గంగుల

రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం సేకరించడానికి పౌరసరఫరాల శాఖ సర్వం సిద్దం చేసింది. ఇదే అంశంపై నేడు కరీంనగర్లోని తన నివాసంలో పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులతో మంత్రి గంగుల కమలాకర్ సమీక్ష నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ.. యాసంగి ధాన్యం సేకరణలో తెలంగాణ రాష్ట్రం దేశంలో నెంబర్ 1గా నిలిచిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు అనుకూల విధానాలు, రైతు బందు, రైతు బీమా, 24 గంటల ఉచిత కరెంటు, కాళేశ్వర జలాలతో పంట విస్థీర్ణం ఏటికేడు పెరుగుతూ రికార్డు స్థాయిలో ధాన్యాన్ని సేకరిస్తున్నామన్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా రైతు పండించిన చివరిగింజను మద్దతు ధరతో కొనాలన్న ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా పని చేస్తామన్నారు. ప్రపంచవ్యాప్త నివేదికల్లో ఓవైపు యావత్ ప్రపంచంలో 20 ఏళ్ల కనిష్టానికి బియ్యం ఉత్పత్తి పడిపోతుంటే, కేవలం తెలంగాణలో మాత్రమే బియ్యం ఉత్పత్తి ఆరింతలు పెరిగిందన్నారు.

ఇది తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ సాధించిన ఘనత అని పేర్కొన్నారు.
నిన్నటివరకూ రాష్ట్ర వ్యాప్తంగా 1131 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసి వాటి ద్వారా 186 కోట్లు విలువ చేసే 90వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామని అత్యధికంగా నల్గొండ, నిజమాబాద్ లో కొనసాగుతుందన్నారు. ధాన్యం కోతలకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు స్థానిక యంత్రాంగం నిర్ణయం తీసుకుంటుందన్నారు. లక్ష్యం మేరకు సేకరణకు అవసరమైన 7031 పైచీలుకు కొనుగోలు కేంద్రాలు, గన్నీ బ్యాగులు, మాయిశ్చర్ మిషన్లు, వేయింగ్ మిషన్లు, హమాలీలును సమకూర్చుకున్నామని, అకాల వర్షాల నేపథ్యంలో టార్పలిన్లను సైతం అందుబాటులో ఉంచామన్నారు. రైతులు ఫెయిర్ ఆవరేజి క్వాలిటీతో కూడిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి దాన్యం అమ్ముకోవాలని మంత్రి సూచించారు. ఈ సమీక్షలో సివిల్ సప్లైస్ కమిషనర్ అనిల్ కుమార్, పౌరసరఫరాల సంస్థ జీఎం రాజారెడ్డి, కరీంనగర్ అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్, జిల్లా డిసిఎస్ఓ, సురేష్ రెడ్డి డిఎం శ్రీకాంత్ రెడ్డి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement