త్వరలో 60వేల నుండి 70వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని మంత్రి నిరంజన్ రెడ్డి నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు. తెలంగాణలోని నిరుద్యోగులనే టార్గెట్ చేస్తూ రాష్ట్రంలో కొత్తగా వైఎస్ ఆర్ టీపీ పార్టీని పెట్టిన వైఎస్ షర్మిల పోరాడుతోన్న విషయం తెలిసిందే. ప్రతి మంగళవారం నిరుద్యోగుల సమస్యలపై దీక్షని చేపట్టారామె. మంత్రి ప్రకటించిన ప్రకటనతో నిరుద్యోగుల్లో కొత్త ఆశలు చిగురించినట్టే. పాత పద్ధతిలో నోటిఫికేషన్ వస్తే 20 వేల ఉద్యోగాలు.. ఆంధ్ర వారికి వెళ్లిపోతాయని అందుకే ఆ ఛాన్స్ దక్కకుండా సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారని నిరంజన్ రెడ్డి వెల్లడించారు.
త్వరలో 60 వేల నుండి 70 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్టు ఆయన స్పష్టం చేశారు.తెలంగాణ వచ్చిన తర్వాత ఏడేళ్లలో లక్షా యాభై వేల ఉద్యోగాలను భర్తీ చేశామని నిరంజన్ రెడ్డి వివరించారు. అంతేకాకుండా ప్రధాని మోడీ ఉద్యోగాలు ఇవ్వకుండా యువతను మోసం చేశారని విమర్శించారు. ఇదిలా ఉంటే కేవలం హుజురాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలోనే ప్రభుత్వం ఇలాంటి మాటలు చెబుతోందని నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దుబ్బాక ఉప ఎన్నిక సమయంలోనూ త్వరలో ఉద్యోగాలు అంటూ ఇలాంటి ప్రకటనలు చేసి నిరుద్యోగులను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఏమవుతుందో చూడాలి. నిజంగానే ఉద్యోగాలు ఇస్తారా వారు అన్నట్లుగానే ఇదంతా ఎన్నికల ముందు వ్యూహమేనా అనేది తెలియాల్సి ఉంది.