Thursday, April 25, 2024

తమిళనాడులో మళ్లీ లాక్‌ డౌన్‌ పొడగింపు.. ఈసారి ఎన్ని రోజులంటే..

తమిళనాడులో మరో వారం రోజుల పాటు ప్రభుత్వం లాక్‌డౌన్‌ను పొడగించింది. ప్రస్తుతం కొనసాగుతున్న లాక్‌ డౌన్‌ ఈ నెల 7వ తేదీతో ముగియనుంది. ప్రస్తుతం కరోనా ఉధృతిని దృష్టిలో పెట్టుకుని ఈ నెల 14వ తేదీ వరకు పొడగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వైరస్‌ వ్యాప్తి తక్కువ ఉన్న పలు జిల్లాలకు సడలింపులను ప్రకటించింది. 11 జిల్లాలు మినహా రాష్ట్రవ్యాప్తంగా సడలింపులుంటాయని ప్రభుత్వం తెలిపింది.

కిరాణ దుకాణాలు, చేపలు, మాంసం, కూరగాయలు, పండ్లు, పూల దుకాణాలు ఉదయం 6 గంటల నుంచి 5 గంటల మధ్య తెరిచేందుకు అనుమతి ఇచ్చింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు 30 శాతం సిబ్బందితో పని చేయనున్నాయి. షాపింగ్‌ కాంప్లెక్స్‌, మాల్స్‌, పర్యాటక ప్రదేశాలు, సినిమా థియేటర్‌, సెలూన్ షాపులు రాష్ట్రవ్యాప్తంగా మూసి ఉంచనున్నారు. కోయంబత్తూర్‌, నీలగిరి, తిరుప్పూర్‌, ఈరోడ్‌, సేలం, కరూర్‌, నమక్కల్‌, తంజావూర్‌, తిరువారూర్‌, నాగపట్నం, మాయిలదుతూరై జిల్లాల్లో కరోనా కేసులు అధికంగా ఉండడంతో ప్రభుత్వం ఆంక్షలు విధించింది.

తమిళనాడులో కొత్తగా 22,651 కోవిడ్ -19 కేసులు నమోదు కాగా.. 463 మంది మృతి చెందారు. ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం శుక్రవారం వరకు రాష్ట్రలో 21,95,402 కరోనా కేసులు నమోదు అయ్యాయి. మరణించిన వారి సంఖ్య 26,128 కు చేరుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement