Sunday, April 28, 2024

Delhi: CAAపై స్టేకు సుప్రీం నిరాకరణ.. విచార‌ణ ఏప్రిల్ 9కి వాయిదా

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఇటీవలే అమలులోకి తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై స్టే ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సూప్రీం కోర్టు ఇవాళ విచారణ జరిపింది. ఈ సందర్భంగా సీఏఏపై స్టే ఇచ్చేందుకు చీఫ్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ జేబీ పార్ధీవాలా, జస్టిస్‌ మనోజ్‌మిశ్రాలతో కూడిన ధర్మాసనం నిరాకరించింది. సీఏఏపై స్టే కోరుతూ సుప్రీంలో దాఖలైన 230 పిటిషన్లపై మూడు వారాల్లో వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. ఇక.. ఏప్రిల్ 8వ తేదీలోగా కేంద్రం తన స్పందన తెలియజేయాలని సుప్రీంకోర్టు కోరింది. ఈ పిటిషన్లపై ఏప్రిల్ 9 వరకు విచారణ వాయిదా వేస్తున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది.

సీఏఏ కింద పౌరసత్వం పొందలేకపోయిన ముస్లిం వలసవాదులపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని, ఈ కారణం ఆధారంగా స్టే ఇవ్వాలని కేరళకు చెందిన ఇండియన్‌ ముస్లిం లీగ్‌ పిటిషన్‌లో కోరిన విషయం తెలిసిందే. సీఏఏ సెక్షన్‌ 6బి కింద ఎవరికి పౌరసత్వాలివ్వకుండా స్టే ఇవ్వాలని ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ సైతం పిటిషన్‌​ వేశారు. ఈ పిటిషన్లే కాక పలు సంస్థలు, ఇతర వ్యక్తులు కూడా సీఏఏపై సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement