Sunday, April 28, 2024

ప్రొద్దుటూరులో వైభవంగా శ్రీనివాస కల్యాణం

ప్రొద్దుటూరు (రాయలసీమ ప్రభ వెబ్ ప్రతినిధి) వైయస్సార్ జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్ హైస్కూల్ మైదానంలో ఆదివారం సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు శ్రీనివాస కళ్యాణం వైభవంగా జరిగింది. తిరుమల శ్రీవారి ఆలయ ప్రధానార్చకుల్లో ఒకరైన శ్రీ కృష్ణ శేషాచల దీక్షితులు,అర్చక బృందం సాయంత్రం 6 గంటలకు వేద పండితులు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారి ఉత్సవర్లను కల్యాణవేదిక వద్దకు తీసుకొచ్చారు. సాయత్రం 6 నుండి 8 గంటల వర కు అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, కంకణధారణ, అగ్నిప్రతిష్టాపన, యజమాని సంకల్పం, భక్త సంకల్పం, మహాసంకల్పం, మంగళసూత్రధారణ ఘట్టాలతో వేదమంత్రాలు పఠిస్తూ శాస్త్రోక్తంగా స్వామివారి కల్యాణాన్ని నిర్వహించారు.

చివరిగా నక్షత్రహారతి, మంగళహారతి కార్యక్రమంతో కల్యాణం దిగ్విజయంగా ముగిసింది. శ్రీవారు, అమ్మవార్ల కల్యాణ ఘట్టాన్ని నేత్రపర్వంగా తిలకించిన ప్రొద్దుటూరు భక్తులు భక్తి పరవశంతో పులకించారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసన సభ్యులు రాచమల్లు శివ ప్రసాద రెడ్డి ,టీటీడీ బోర్డు సభ్యులు మారుతి ప్రసాద్ ఇతర అధికార అనధికార ప్రముఖులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement