హైదరాబాద్, ఆంధ్రప్రభ: పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా దక్షిణ తెలంగాణప్రజల దశాబ్దపు కల నెరవేరుతుందని రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చెప్పారు. శనివారం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో సీఎం ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్, ఎపీ రాములుతో కలిసి మంత్రి సింగిరెడ్డి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ 2015 జాన్ 11న రూ. 35వేల కోట్ల అంచనావ్యయంతో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సీఎం కేసీఆర్ శంకు స్థాపన చేశారని తెలిపారు.కొన్ని సాంకేతిక కారణాలతో పనులు ఆలస్యం అయ్యాయని చెప్పారు.
నూతన సచివాలయంలో సీఎం కేసీఆర్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పై తొలిసమావేశం నిర్వహించి అనేక నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ఇంజనీర్లను అదేశించారని చెప్పారు. దీంతో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం లోని నార్లాపూర్ రిజర్వాయర్ పంపును పరిశీలించామని చెప్పారు. కృష్ణా నదిలోని 7 టీఎంసీ నీటితో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి,నల్గొండ జిల్లాలను కలిపి 12లక్షల 50వేల ఎకరాలకు ప్రణాలిక తయారు చేసినట్లు మంత్రితెలిపారు. భవిష్యత్ లో నీటి ఇబ్బందులు రాకుండా ఉన్న నీటి కేటాయింపులతో ఈ ప్రాంత ప్రజల అవసరాలు తీర్చేందుకు ఈ పథకం చేపట్టినట్లు మంత్రి తెలిపారు.
పనులు పురోగతిలో ఉన్నయన్నారు. సంబంధిత ఇంజనీర్ల ద్వారా నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి దశలవారిగా ఎలక్ట్రికల్ మెకానికల్ పనులు ఇంజనీరింగ్ బృందాలతో ఏజెన్సీల ద్వారా పరిశీలించినట్లు తెలిపారు. ఇక్కడి ప్రాంతప్రజల దశాబ్దం కల నేరవేరనుందన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభమైతే దక్షిణ తెలంగాణ సస్యశ్యామలం కానుందన్నారు. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ ఏంపీ రాములు, నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్,ఈఎన్సీ మురళీధర్ రావు, సలహాదారు పెంటారెడ్డి, నాగర్ కర్నూల్ ఈఎన్సీ హమీద్ ఖాన్ జిల్లా అధికారులు పాల్గొన్నారు.