Monday, April 29, 2024

చెరువు నిండా నీళ్లు.. ఎండిపోతున్న నారుమళ్లు!

గోవిందరావుపేట, ప్రభన్యూస్ : వర్షాకాలం సీజన్‌ లేటుగా స్టార్ట్‌ అయినా కూడా గత నెల ఆఖరులో వచ్చిన తుపాన్లతో మొత్తానికి లక్నవరం సరస్సు మత్తడి పడింది. లక్నవరం సరస్సు కింద ప్రధాన నీటి కాలువలకు వర్షాల కంటే ముందే గండ్లు పడ్డాయి. మరోవైపు తుపాను కార‌ణంగా వచ్చిన భారీ వరదలకు ప్రతి కాల్వకు పదికి పైగా భారీ గండ్లు పడ్డాయి. అయితే నీటిపారుదల శాఖ అధికారులు గండ్లు పూడ్చే ప్రయత్నంలో ఉన్నప్పటికీ వచ్చిన తుపాన్లతో కొంతమంది రైతులు నాట్లు వేసి ఇప్పుడు నీళ్ల కోసం ఎదురుచూపులు చూస్తున్నారు.

గత నెలలో వర్షాలు భారీగా కొట్టినప్పటికీ ఇంతవరకు మళ్లీ చినుకు లేకపోవడంతో నారుమళ్లు సైతం ఎండిపోతున్నాయి. శుక్రవారం పస్రా గ్రామం రాంపూర్‌ శివారులోని రైతుల నారుమళ్లు ఎండిపోతున్న క్రమంలో ట్రాక్టర్‌తో వాటర్‌ ట్యాంకు ద్వారా నారుమళ్లను తడుపుకున్నారు. రైతులు పన్నాల సమ్మిరెడ్డి, పసుమర్తి సత్యనారాయణ ఆంధ్రప్రభతో మాట్లాడుతూ, వర్షాకాలం సీజన్‌ లేటుగా స్టార్ట్‌ అయినా వచ్చిన వర్షాలకు నారుమళ్లు పోసుకున్నాం.

- Advertisement -

చెరువు కాలువలకు గండ్లు పడడంతో ఇప్పుడు నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. గత 15 రోజుల నుండి వర్షం లేకపోవడంతో నారుమళ్లు ఎండిపోతున్నాయి. నాటు- వేస్తామో లేదో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. నారుమళ్లు ఎండిపోతుంటే చూడలేక ట్రాక్టర్‌ ద్వారా ట్యాంకర్‌తో నీరు తరలించి నారుమళ్లను కాపాడుకుంటు-న్నామని రైతులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement