Thursday, May 9, 2024

ప్రాంతీయ భాషల అంతర్జాలం అవసరం: కేంద్ర ఐటీ మంత్రి

ప్ర‌భ‌న్యూస్ : డిజిటల్‌ ఇండియా సాకారం దిశగా ప్రధాని నరేంద్రమోడీ కృషిచేస్తున్నారని కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. ఈ క్రమంలో ప్రతి ఒక్కరికీ ఇంటర్నెట్‌ సేవలు అందించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. బహుభాషా ఇంటర్నెట్‌పై ఎలక్ట్రానిక్స్‌, ఐటీ మంత్రిత్వ శాఖ నిర్వహించిన వర్క్‌షాప్‌లో కేంద్రమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, బహుభాషా ఇంటర్నెట్‌ను ఆధునిక భారతదేశ చరిత్రలోని విద్యారంగంలో అతిపెద్ద సంస్కరణగా అభివర్ణించారు. ప్రాంతీయ భాషలను బోధనా మాధ్యమంగా ఉపయోగించడాన్ని నూతన విద్యావిధానం ప్రోత్సహిస్తుందని తెలిపారు. కొవిడ్‌ సమయంలో ఇంటర్నెట్‌ ప్రాధాన్యత మరింత పెరిగిందని, భవిష్యత్‌లోనూ దీని అవసరం ఇంకా పెరుగు తుందని చెప్పారు. ఈ క్రమంలో ఇంటర్నెట్‌ను బహుభాషల్లో తీసుకొచ్చేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.

ఈ వర్క్‌షాప్‌లో గూగుల్‌, మైక్రోసాప్ట్‌, మొజిల్లా సహా అనేక ఇంటర్నెట్‌ ఆధారిత దిగ్గజ సంస్థలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. ఇంటర్నెట్‌, టెక్నాలజీ వేదికలు ప్రాంతీయ భాషలకు మద్దతు ఇవ్వాల్సిన అవసరముందని రాజీవ్‌ చంద్రశేఖర్‌ అన్నారు. ఇందుకోసం ఎలక్ట్రానిక్‌, ఐటీమంత్రితశాఖ సంబంధిత పరిశ్రమలతో భాగసామ్యం కుదుర్చుకుంటుందని పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్స్‌, ఐటీ శాఖ కార్యదర్శి అజయ్‌ ప్రకాశ్‌ మాట్లాడుతూ.. ‘ఇంటర్నెట్‌ కోట్లాది మంది భారతీయులకు చేరువైంది. కానీ, అందులోని కంటెంట్‌ మొత్తం ఇంగ్లిష్‌లో ఉండటంతో ఇంకా చాలా మందికి అందుబాటులోకి రాలేదు. అయితే, బహుభాషా ఇంటర్నెట్‌ ద్వారా 40కోట్ల మంది ఇంటర్నెట్‌ వినియోగదారులను డిజిటల్‌ ఇండియాలో భాగం చేయొచ్చు”అని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement