Monday, May 6, 2024

రైల్వే మహిళా ఉద్యోగులకు సన్మానం

దక్షిణ మధ్య రైల్వేలో అంకితభావంతో విశేష సేవలందిస్తూ విధులు నిర్వహిస్తున్న 125 మంది రైల్వే సిబ్బందిని, కాంట్రాక్ట్‌ ఉద్యోగులను దక్షిణ మధ్య రైల్వే మహిళా సంక్షేమ సంఘం (ఎస్‌సిఆర్‌డబ్ల్యుడబ్ల్యుఓ) ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమాన్ని సికింద్రాబాద్‌ చిలకలగూడాలోని విద్యా విహార్‌ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే మహిళా సంక్షేమ సంఘం కార్యదర్శి ఉషా జైన్‌, జాయింట్‌ ట్రెజరర్‌ మాధవి విజయ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉషా జైన్‌ మాట్లాడుతూ భారతీయ రైల్వే పురోగతికి అంకితభావంతో కృషి చేస్తున్న ఉద్యోగులను అభినందించారు. సంస్థలో ప్రతి ఉద్యోగి గౌరవ ప్రదమైన స్థానాన్ని పొందుతున్నారని అన్నారు. వారికి గౌరవమైన జీవితాన్ని గడిపే హక్కు ఉందన్నారు. వివిధ విభాగాలలో అంకితభావంతో విధులు నిర్వహిస్తూ సంస్థ అభివృద్ధికి తోడ్పడుతూ సన్మానం అందుకున్న వారికి ఆమె శుభాభినందనలు తెలిపారు. రైల్వే వ్యవస్థ సజావుగా సాగడానికి కృషి చేస్తున్న సిబ్బందికి తగిన గుర్తింపు లభిస్తుందని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement