ప్రభన్యూస్, హైదరాబాద్ ప్రతినిధి : సురక్షిత ప్రయాణం, భద్రతే లక్ష్యంగా భారతీయ రైల్వేశాఖ దేశంలోని పలు రైల్వేస్టే షన్లను ఇంటర్నెట్ ప్రొటోకాల్ ఆధారిత వీడియో నిఘా నీడలోకి తేనుంది. నిర్భయ నిధుల ద్వారా మొదటిదశలో చేపట్టనున్న ఈ పథకంలో హైదరాబాద్ నగరంలోని 24 స్టేషన్లను ఎంపిక చేశారు. అడుగడుగునా సీసీ కెమెరాలు, ప్రవేశ ద్వారాల వద్ద మెటల్ డిటెక్టర్లు, పటిష్ట మైన పోలీసు భద్రత ఉండగానే సికింద్రాబాద్తో పాటు దేశ వ్యాప్తంగా పలు రైల్వేస్టే షన్ల లో వేలాదిమంది చొరబడి విధ్వంసం సృష్టి ంచిన నేపథ్యంలో సర్కార్ ఆగమేఘాల మీద రైల్వే స్టేషన్ల భద్రతపై దృష్టి పెట్టిందని తెలుస్తోంది. ప్రయాణికుల రద్దీని బట్టీ ఏ1, ఏ, బీ, సీ నాలుగు కేటగిరీలుగా విభజించింది. ఎంపిక చేసిన రైల్వే స్టేషన్లలోని విశ్రాంతి గదులు, రిజర్వేషన్ కౌంటర్లు, పార్కింగ్ స్థలాలు, ప్రవేశ ద్వారాలు, ప్లాట్ఫారాలు, పార్కింగ్ స్థలాలు, బుకింగ్ కౌంటర్లలో డోమ్ టైప్, పాన్ టిల్డ్ జూమ్ టైప్, బులెట్ టైప్, అల్ట్రా హెచ్డీ కెమెరాలను ప్రాధాన్యతను బట్టి ఏర్పాటు చేయనున్నారు. వీడియో నిఘా ప్రాజెక్ట్ను 2023 జనవరిలోగా అందుబాటులోకి తెచ్చేందుకు రైల్వేశాఖ టెండర్లను సైతం ఖరారు చేసింది. రెండవ దశలో నగరంలోని మిగతా రైల్వే స్టేషన్ల లో ఈ పథకాన్ని అమలు చేయనున్నట్టు రైల్వే వర్గాలు తెలిపాయి.
రంగు, కదలికలను బట్టి నేరస్థుల గుర్తింపు..
ఈ అధునాతన వీడియో కెమెరాల ద్వారా ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నేరస్థులను ఇట్టే గుర్తు పట్టే అవకాశం ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సీ అందజేసే విశ్లేషణ సాఫ్ట్ వేర్ నిర్వహణతో కెమెరా ట్యాంపరింగ్, వాహనాలను గుర్తిస్తారు. అలాగే రంగులు, ప్రవర్తన ద్వారా నేరస్థులను గుర్తించడం, ప్రమాదం జరిగినప్పుడు సంబంధిత ప్రాంతాన్ని ఐడెంటీ ఫై చేయడం తదితర ప్రయోజనాలు ఇంటర్నెట్ ప్రొటోకాల్ ఆధారిత వీ డియో నిఘా ద్వారా అందుబాటులోకి రానున్నాయి. కెమెరాలు, సర్వర్, యూపీఎస్, స్విచుల పర్యవేక్షణ కోసం నెట్వర్క్ మేనేజ్మెంట్ సిస్ట మ్ ఏర్పాటు చేయనున్నారు. వీటిని సంబంధిత సిబ్బంది ఏ బ్రౌజర్ నుంచైనా వీక్షించవచ్చు. సీసీ టీవీ కెమెరాల్లో రికార్డు అయిన ఈ వీడియోలను 30రోజుల వరకు అందుబాటులో ఉంచుతారు.
నగరంలో ఎంపికైన రెల్వేస్టే షన్లు ..
సీతాఫల్మండి, ఆర్ట్స్ కాలేజీ, డభీర్పూర, ఫలక్నామా, ఉప్పుగూడ, జామై ఉస్మానియా, మలక్పేట, విద్యానగర్, యాకత్పుర, భరత్నగర్, బోరబండ, చందానగర్, ఫతేపూర్ బ్రిడ్జి, హఫీజ్పేట,హైటెక్ సిటీ, జెమ్స్ స్ట్రీ ట్, ఖైరతాబాద్, లక్డీకాపూల్, నేచర్ క్యూర్ హాస్పిటల్, నెక్లెస్రోడ్, సంజీవయ్య పార్క్, బేగంపేట, లింగంపల్లి, కాచిగూడ మొదలగు 24 స్టే షన్ల ను మొదటి దశలో నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.