Sunday, April 28, 2024

Kerala: రాహుల్‌గాంధీ ఆస్తి రూ.20 కోట్లే

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ రానున్న లోక్ స‌భ ఎన్నిక‌ల్లో కేర‌ళ‌లోని వ‌య‌నాడ్ నుంచి పోటీ చేస్తున్నారు. ఆయ‌న నిన్న నామినేష‌న్ దాఖ‌లు చేశారు. ఈ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్‌లో ఈ మేరకు పేర్కొన్నారు. రాహుల్ గాంధీకి రూ. 20 కోట్ల ఆస్తులు ఉన్నాయి కానీ, సొంత వాహనం గానీ, రెసిడెన్షియల్ ఫ్లాట్ కానీ లేదట. అఫిడవిట్‌లో పేర్కొన్న ప్రకారం రాహుల్ వద్ద రూ.55 వేల నగదు, రూ. 26.25 లక్షల బ్యాంకు డిపాజిట్లు, రూ. 4.33 కోట్ల బాండ్లు, షేర్లు, రూ. 3.81 కోట్ల మ్యూచువల్ ఫండ్స్, రూ. 15.21 లక్షల గోల్డ్ బాండ్లు, రూ. 4.20 లక్షల విలువైన నగలు సహా రూ. 9.24 కోట్ల చరాస్తులు ఉన్నాయి.

రాహుల్ రూ.11.15 కోట్ల స్థిరాస్తులు కలిగి ఉన్నారు. ఢిల్లీలోని మెహరౌలి ప్రాంతంలో సోదరి ప్రియాంకగాంధీతో కలిసి వ్యవసాయభూమి ఉంది. గురుగ్రామ్‌లో రూ. 9 కోట్లకుపైగా విలువైన ఆఫీస్ స్పేస్ ఉంది. వ్యవసాయ భూమి తనకు వారసత్వంగా వచ్చిందని రాహుల్ అఫిడవిట్‌లో పేర్కొన్నారు. అలాగే అత్యాచార బాధిత కుటుంబ వివరాలను సోషల్ మీడియాలో బయటపెట్టినందుకు రాహుల్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. దీంతోపాటు బీజేపీ నేతల ఫిర్యాదుపై పరువునష్టం కేసులు కూడా ఉన్నట్టు పేర్కొన్నారు. అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్‌కు సంబంధించి నేరపూరిత కుట్ర కేసు కూడా తనపై నమోదైనట్టు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ వయనాడ్ నుంచి గెలుపొందారు. ఈసారి ఆయనకు ప్రత్యర్థులుగా సీపీఐ నేత అన్నీ రాజా, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కే సుందరన్ బరిలో ఉన్నారు. కేరళలో ఈనెల 26న ఎన్నికలు జరగనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement