Wednesday, April 24, 2024

Follow up : పట్టణ ప్రగతి వల్లే స్వచ్ఛ అవార్డులు.. మరో 7 మున్సిపాలిటీలకు అవార్డులపై మంత్రి కేటీఆర్‌ హర్షం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్రంలోని పట్టణాలు మరోసారి దేశంలో తమ ప్రత్యేకతను చాటాయి. స్వచ్ఛ సర్వేక్షణ్‌-2022లో మునిసిపాలిటీలు వరుసగా అవార్డులు గెలుచుకుంటున్నాయి. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ప్రకటించిన అవార్డుల జాబితాలో మరో 7 తెలంగాణ పట్టణాలకు చోటు దక్కింది. గతంలో అవార్డులు గెలుచుకున్న 16 మునిసిపాలిటీలతో పాటు కాగజ్‌నగర్‌, జనగామ, అమన్‌గల్‌, గుండ్లపోచంపల్లి, కొత్తకోట, వర్ధన్నపేట, గ్రేటర్‌ వరంగల్‌ పురపాలికలకు ఫాస్టెస్ట్‌ మూవింగ్‌ కేటగిరీలో కేంద్ర ప్రభుత్వం అవార్డులను ప్రకటించింది.

తాజాగా ఈ కేంద్రం ఇచ్చిన అవార్డులపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌ ఆలోచనలో నుంచి పురుడు పోసుకున్న పట్టణ, పల్లె ప్రగతిలతో తెలంగాణ పల్లెలు, పట్టణాల రూపురేఖలు మారి అద్భుతమైన అభివృద్ధి సాధిస్తున్నాయని మంత్రి కేటీఆర్‌ అన్నారు. కేంద్ర ప్రభుత్వ అవార్డులు రావడంలో పురపాలక శాఖ సిబ్బంది,ప్రజాప్రతినిధులు కీలక పాత్ర వహించారని వారందరికీ అభినందనలు తెలుపుతున్నానన్నారు. గతంలో అవార్డులు సాధించిన పురపాలికలతో సమావేశం ఏర్పాటు చేసిన మంత్రి ఆ పట్టణాలకు రూ.2 కోట్ల ప్రోత్సాహకం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement