Wednesday, May 1, 2024

TTD : మిల్లర్ల నుంచి నాణ్యమైన బియ్యం కొనుగోలు : ఈవో ధర్మారెడ్డి

తిరుమల : తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు మరింత నాణ్యమైన, రుచికరమైన అన్న ప్రసాదాలు అందించడానికి మిల్లర్ల నుంచి నేరుగా బియ్యం కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లు టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డి చెప్పారు. తిరుపతి పద్మావతి విశ్రాంతి గృహంలో మంగళవారం ఈవో, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లోని రైస్ మిల్లర్ల అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఈవో ధర్మారెడ్డి మాట్లాడుతూ.. టీటీడీ అన్నప్రసాదాలకు, ఇతర అవసరాలకు 2013 నుండి 2019వ సంవత్సరం వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నుండి నాణ్యమైన సోనా మసూర బియ్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. 2019 లో ధర్మకర్తల మండలి నిర్ణయం మేరకు టెండర్ ద్వారా బియ్యం కొనుగోలు చేయాలని నిర్ణయించారన్నారు. టెండర్ ప్రక్రియ ద్వారా బియ్యం కొనుగోలు చేయడం వల్ల వ్యాపారస్తులు, మిల్లర్ల వద్ద కొని టీటీడీకి సరఫరా చేస్తున్నారన్నారు. టీటీడీ నేరుగా రైస్ మిల్లర్ల వద్ద కొనుగోలు చేయడం వలన మరింత నాణ్యమైన బియ్యం అందుతాయని ఆయన చెప్పారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆదేశాల మేరకు అన్న ప్రసాదాలను మరింత రుచికరంగా అందించేందుకు తెలుగు రాష్ట్రాల్లోని రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో పాల్గొన్న మిల్లర్లు వారం రోజుల్లో బియ్యం సరఫరా రేటు తెలియజేస్తామని చెప్పినట్లు తెలిపారు. ఇటీవల టీటీడీ అన్నప్రసాదంలో బియ్యం బాగాలేవని భక్తుల నుండి ఫిర్యాదులు అందాయన్నారు. ప్రస్తుతం టెండర్ ద్వారా వ్యాపారస్తులు రూ.38 రూపాయలకు కేజి బియ్యం అందిస్తున్నారని ఈవో వివరించారు. గో ఆధారిత వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు రైతు సాధికార సంస్థ, ఏపి మార్క్ ఫెడ్లతో ఒప్పందం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో జేఈవో సదా భార్గవి, డిప్యూటీ ఈవోలు సెల్వం, శ్రీమతి పద్మావతి, జిఎం (కొనుగోలు) సుబ్రహ్మణ్యం జిఎం ప్రాక్యూర్మెంట్, అన్న ప్రసాదం ప్రత్యేకాధికారి శ్రీ శాస్త్రి, ఇతర అధికారులు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement