Monday, April 29, 2024

PadmaAwards | పద్మ అవార్డు గ్రహీతలకు అవార్డుల ప్రదానం..

ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మ అవార్డు గ్రహీతలకు పురస్కారాలను అందించారు. సోమవారం (ఏప్రిల్ 22) సాయంత్రం 6 గంటలకు ఈ కార్యక్రమం రాష్ట్రపతి భవన్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు దేశంలోనే రెండో అత్యున్నత పౌర పురస్కారం అయిన పద్మవిభూషణ్ పురస్కారాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందజేశారు.

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కూడా రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మ విభూషణ్ పురస్కారాలు అందుకున్నారు. వెంకయ్యనాయుడు, చిరంజీవిలతో పాటు సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు బిందేశ్వర్ పాఠక్ (మరణానంతరం), ప్రముఖ నటి వైజయంతీమాల, సుప్రసిద్ధ నాట్య కళాకారిణి పద్మ సుబ్రహ్మణ్యం పద్మవిభూషణ్ కు ఎంపికయ్యారు.

ఇవాళ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మ పురస్కారాలు అందుకున్న వారిలో బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి (పద్మ భూషణ్), ప్రముఖ గాయని ఉషా ఉతుప్ (పద్మ భూషణ్), ఉత్తరప్రదేశ్ మాజీ గవర్నర్ రామ్ నాయక్ (పద్మ భూషణ్), ప్రముఖ పారిశ్రామికవేత్త సీతారామ్ జిందాల్ (పద్మ భూషణ్) తదితరులు ఉన్నారు. దాదాపు 67 మంది ప్రముఖులకు నేడు (ఏప్రిల్ 22) అవార్డులు అందజేయగా… మిగిలిన అవార్డులను వచ్చే వారం ప్రదానం చేసే అవకాశం ఉంది.

రాష్ట్రపతి భవన్ లో జరిగిన ఈ పురస్కారాల ప్రదాన కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి జగదీప్ ధంకర్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జై శంకర్ తదితరులు హాజరయ్యారు. ఈసారి కేంద్రం ఐదుగురికి పద్మ విభూషణ్, 17 మందికి పద్మ భూషణ్, 110 మందికి పద్మ శ్రీ పురస్కారాలు ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement