Wednesday, May 22, 2024

Crime : ఆగని అరాచకాలు.. యువతులు, మహిళలే లక్ష్యంగా వేధింపులు

ప్రభన్యూస్ : హైదరాబాద్‌ మహానగరంలో మగువలపై సాగుతున్న అరాచకాలకు అడ్డుకట్ట పడటం లేదు. జూబ్లిహిల్స్‌ నియోజకవర్గం పరిధిలోని ఎస్సార్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శనివారం సభ్యసమాజం సిగ్గుతో తల వంచుకోవాల్సిన ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి, స్థానికులు, బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం కామాంధుడు ఎర్రగడ్డ ప్రాంతంలోని సుల్తాన్‌ నగర్‌ నుండి రాజీవ్‌నగర్‌ వరకు బైకుపై వివాహిత(34)ను వెంబడిస్తూ వెకిలిచేష్టలతో అసభ్యంగా ప్రవర్తించాడు. రాజీవ్‌నగర్‌లోని రాయల్‌ ఫంక్షన్‌ హాల్‌ సమీపానికి వివాహిత చేరుకున్న సమయంలో అతని వెకిలిచేష్టలు మరింత శృతిమించాయి. దీంతో సదరు వివాహిత కాపాడాలంటూ గట్టిగా ఆర్తనాదాలు చేయడంతో స్థానికులు స్పందించి, ఆ నిందితుడిని పట్టుకొని డయల్‌ 100కు కాల్‌ చేసి ఎస్సార్‌నగర్‌ పోలీసులకు అప్పగించినట్లు తెలుస్తోంది. అయితే ఆ నిందితుడు తన పట్ల ఇదివరకే రెండు మూడు సార్లు అసభ్యంగా ప్రవర్తించాడని, ఇటువంటి నిందితుడిపై కఠినచర్యలు తీసుకొని, మహిళలను కాపాడాలని బాధితురాలు కోరుతోంది. అదే విధంగా నిందితుడిపై పలు ఆరోపణలున్నాయని, సదరు నిందితుడి ఆగడాలతో మోసపోయిన వారెందరో ఉన్నారంటూ ఆమె విమర్శలు గుప్పించడం గమనార్హం.

పోలీసుల అదుపులో నిందితుడు..

ఎస్సార్‌నగర్‌ సీఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి బోరబండకు చెందిన ఖలీల్‌(21)గా గుర్తించామని, బాధిత వివాహిత(34) కూడా బోరబండ, గణేష్‌ నగర్‌కు చెందిన వారిగా గుర్తించామని తెలిపారు. జరిగిన ఘటనపై దర్యాప్తులో భాగంగా ఇప్పటికే సీసీ ఫుటేజ్‌ను సేకరించామని తెలిపారు. నిందితున్ని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement