Thursday, May 30, 2024

National | జులై 1 నుంచి అమల్లోకి కొత్త క్రిమినల్‌ చట్టాలు

బ్రిటిష్‌ కాలం నాటి క్రిమినల్‌ చట్టాలను తొలగించి వాటి స్థానంలో కొత్త చట్టాలను ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం వాటి అమలు వివరాలను ప్రకటించింది. ఈ ఏడాది జులై 1 నుంచి ఈ మూడు చట్టాలు అమల్లోకి వస్తాయని కేంద్రం వెల్లడించింది. 1860 నాటి నుంచి అమల్లో ఉన్న భారతీయ శిక్షాస్మృతి, భారతీయ నేరస్మృతి, భారతీయ సాక్ష్యాధార చట్టం-1872 స్థానంలో.. భారతీయ న్యాయ సంహిత-2023, భారతీయ నాగరిక్‌ సురక్ష సంహిత-2023, భారతీయ సాక్ష్య -2023 చట్టాలను కొత్తగా ప్రవేశపెట్టనున్నారు.

గతేడాది ఆగస్టులో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ఈ మూడు బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఉభయ సభల ఆమోదం అనంతరం డిసెంబర్‌ 25న రాష్ట్రపతి ఆమోదంతో ఇవి చట్టాలుగా మారాయి. న్యాయ వ్యవస్థలో సమగ్ర మార్పులతో నేర బిల్లులను కొత్తగా తెచ్చామని అమిత్‌ షా ఈ బిల్లుల ఆమోదం సందర్భం గా పార్లమెంట్‌లో తెలిపారు. ఇక ఈ బిల్లుల లో ఉగ్రవాదానికి సరైన నిర్వచనం ఇవ్వడంతోపాటు రాజద్రోహం వంటి పదాలను తొలగించి.. దానికి బదులు దేశానికి వ్యతిరేకంగా జరిగే దాడులు వంటి పదాలను చేర్చారు. జాతీయ భద్రతకు ప్రమాదకరమైన టెర్రరిజం, కొట్టిచంపడం వంటి నేరాలను కఠిన శిక్షలను ఈ చట్టాలు నిర్దేశిస్తున్నాయి. ఏడేళ్లు అంతకు పైబడిన శిక్ష పడిన నేరాల్లో ఫోరెన్సిక్‌ రిపోర్ట్‌ తప్పనిసరని ఈ చట్టాలు చెబుతున్నాయి.

ఇకపోతే.. భారతీయ న్యాయ సంహితలో కొత్తగా 20 నేరాలను చేర్చారు. ఐపీసీలో ఉన్న 19 నిబంధనల్ని తొలగించారు. 33 నేరాల్లో జైలు శిక్షల్ని పెంచారు. 83 నిబంధనల్లో జరిమానా పెంచగా.. 23 నేరాల్లో తప్పనిసరి కనీస శిక్షను ప్రవేశపెట్టారు. ఆరు నేరాల్లో సమాజసేవను శిక్షగా మార్చారు. కొత్త చట్టాలు భారతీయత, భారత రాజ్యాంగం, ప్రజల శ్రేయస్సుకు ప్రాధాన్యతనిస్తాయని కేంద్రం హోమంత్రి అమిత్‌ షా అప్పట్లో పార్లమెంట్‌లో ఈ బిల్లులను ప్రవేశపెట్టినప్పుడు చెప్పారు. ఈ మూడు చట్టాల పరిధిలోనరి అన్ని వ్యవస్థలు అమల్లోకి వస్తే.. ఐదేళ్లలో భారతీయ న్యాయ వ్యవ స్థ ప్రపంచంలోనే అత్యంత అధునాతనంగా మారుతుందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement