Sunday, April 28, 2024

National – పతంజలిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే – కేంద్రానికి సుప్రీం ఆదేశం ..

న్యూఢిల్లీ – తప్పుదోవ పట్టిస్తున్న పతంజలి ప్రకటనల విషయంలో ప్రభుత్వం ఇంతకాలం కళ్లు మూసుకుని కూర్చుందని దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర స్థాయిలో మండిపడింది. అంతేకాదు ఇలాంటి ప్రకటనల విషయంలో ఇంకా జాప్యం వద్దని.. కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటూ కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. పతంజలి తప్పుడు ప్రకటనలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) వేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు ఇవాళ విచారణ జరిపింది. ఈ క్రమంలో తప్పుదోవ పట్టించే వైద్య ప్రకటనల సమస్యకు పరిష్కారం కనుగొనాలంటూ కేంద్రం తరఫు న్యాయవాదిని అత్యున్నత న్యాయస్థానం కోరింది.
ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్‌కు చెందిన పతంజలి ఆయుర్వేద సంస్థకు గతంలోనే సుప్రీంకోర్టు వార్నింగ్ ఇచ్చింది. హెర్బల్ ఉత్పత్తులపై మోసపూరిత ప్రకటనలు చేస్తే ఒక్కొక్క ఉత్పత్తిపై భారీ జరిమానా తప్పదని తెలిపింది. కంపెనీ చేస్తున్న నిరాధారమైన, మోసపూరితమైన ప్రకటనలను ఆపివేయాలని, లేకపోతే ఆ సంస్థ తయారు చేసే ఒక్కో ఉత్పత్తిపై కోటి రూపాయల చొప్పున జరిమానా విధిస్తామని తీవ్రంగా హెచ్చరించింది. అంతేకాదు..ఆ యాడ్స్‌ను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది కూడా.

మెడికల్‌ అసోషియేషన్‌ పిటిషన్‌..
తమ ఉత్పత్తుల వల్ల కొన్ని వ్యాధులు నయం అవుతాయంటూ పతంజలి కంపెనీ కొన్ని ప్రకటనలు ఇస్తూ వచ్చింది. ఈ ప్రకటనలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కిందటి ఏడాది ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) కోర్టులో కేసు వేసింది. ఆ ప్రకటనలు డాక్టర్లను కించపరిచేలా ఉన్నాయంటూ పేర్కొంది. ఈ పిటీషన్ పైనే ధర్మాసనం విచారణ జరిపింది.

గత విచారణలో..
ఆధునిక అలోపతి వైద్యాన్ని, ఆ విధానాన్ని అనుసరించే డాక్టర్లను కించపరిచేలా..నిరాధార ఆరోపణలు చేస్తున్న పతంజలి ఆయుర్వేద సంస్థ ఉత్పత్తులను, ఆ ఉత్పత్తుల వ్యాపార ప్రకటనలను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది. పతంజలి సంస్థ డాక్టర్లపై కించపరిచేలా వ్యవహరించటం సరికాదని ఈ సందర్భంగా ధర్మాసనం సూచించింది. ప్రజలను తప్పుదారి పట్టించేలా ఇలాంటి ప్రకటనలు చేయవద్దని పతంజలి సంస్థను సుప్రీంకోర్టు ఆదేశించింది. అంతేకాదు ఆ ఆయుర్వేద సంస్థ చేస్తున్న అసత్య ప్రచారాన్ని అడ్డుకునే మార్గాన్ని కనిపెట్టాల్సిందిగా సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి సూచించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement