Saturday, May 4, 2024

National – ప్ర‌పంచానికి అయిదేళ్ల‌లో అభివృద్ధికి భార‌త్ న‌మూనా – ప్ర‌ధాని

వారణాసి: వచ్చే ఐదేళ్లలో అభివృద్ధికి నమూనాగా భారత్‌ మారుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఇదే ‘మోదీ గ్యారంటీ’ అని అభివర్ణించారు. వారణాసి పార్లమెంటు నియోజకవర్గ పర్యటనలో భాగంగా బనారస్‌ హిందూ విశ్వవిద్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రసంగించారు. అనంతరం నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

‘కాశీ.. ఇప్పుడు వారసత్వం, అభివృద్ధికి నమూనాగా కనిపిస్తోంది. సంస్కృతి, సంప్రదాయాల చుట్టూ ఆధునికత ఎలా అభివృద్ధి చెందిందో యావత్‌ ప్రపంచం చూస్తోంది. వచ్చే ఐదేళ్లలో అభివృద్ధికి చిహ్నంగా భారత్‌ మారుతుంది. ఇదే మోదీ గ్యారంటీ’ అని ప్రధాని పేర్కొన్నారు. బనారస్‌ విద్యార్థులను చూస్తుంటే గర్వంగా ఉందన్న ఆయన.. అమృత్‌ కాల్ వేళ వారు దేశాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్తారనే విశ్వాసం కలుగుతోందన్నారు. కాశీకి ఇంతకుముందున్న సామర్థ్యం, రూపం నేడు మళ్లీ ఆవిష్కృతమవుతోందన్నారు. ఈ పర్యటనలో భాగంగా వారణాసి పార్లమెంట్‌ నియోజకవర్గంలో రూ.13వేల కోట్లతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం, శంకుస్థాపనల్లో పాల్గొన్నారు.

విపక్ష కూటమిపై ఫైర్‌..

సంత్‌ రవిదాస్‌ 647 జయంతి సందర్భంగా వారణాసిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న మోదీ.. విపక్ష కూటమి ‘ఇండియా’పై విరుచుకుపడ్డారు. అందులోని భాగస్వామ్యపక్షాలు కులతత్వం పేరిట ప్రజలను దోపిడీ చేస్తున్నాయని మండిపడ్డారు. వారి కుటుంబాల శ్రేయస్సు కోసమే ప్రయత్నిస్తుంటారని, దళితులు, గిరిజనుల సంక్షేమం కోసం ఆలోచించరని విపక్ష పార్టీలపై విమర్శలు గుప్పించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement