Monday, April 29, 2024

Delhi | డోర్నకల్ – మిర్యాలగూడ రైల్వే లైన్ అలైన్‌మెంట్ మార్చండి.. నామ నాగేశ్వరరావు విజ్ఞప్తి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : తెలంగాణలోని డోర్నకల్-మిర్యాలగూడ రైల్వే లైన్ అలైన్‌మెంట్ మార్చాలంటూ ఖమ్మం పార్లమెంట్ సభ్యులు, బీఆర్‌ఎస్ లోక్‌‌సభాపక్ష నేత నామ నాగేశ్వరరావు చేసిన విజ్ఞప్తిపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. శుక్రవారం నామ నాగేశ్వరరావు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను ఆయన కార్యాలయంలో కలిసి జిల్లాలోని రైల్వే సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ప్రతిపాదిత డోర్నకల్ – మిర్యాలగూడ రైల్వే లైన్ అలైన్‌మెంట్‌ను మార్చాలని కోరారు. లేదంటే ఖమ్మం రూరల్, నేలకొండపల్లి, ముదిగొండ మండలాల్లో చాలా మంది రైతులు భూములు కోల్పోతారని ఆయనకు నామ వివరించారు.

నాలుగు హైవేలు, నాగార్జున సాగర్ కాలువ కింద ఇప్పటికే రైతులు ఆయా మండలాల్లో వందలాది ఎకరాల వ్యవసాయ భూములను కోల్పోయారు కేంద్రమంత్రికి చెప్పారు. ప్రతిపాదిత రైల్వే లైన్ వల్ల జిల్లాకు జరిగే ప్రయోజనమేమీ లేదని నామ అన్నారు. ఖమ్మం పట్టణానికి దగ్గరలో ఉన్న పలు గ్రామాల్లో రైల్వే లైన్ కింద పోయే వ్యవసాయ భూములు ఎంతో విలువైనవని ఆయన అశ్విని వైష్ణవ్‌కు వివరించారు. అలైన్‌మెంట్ మార్చి రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరారు. ఖమ్మం జిల్లాతో సంబంధం లేకుండా ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకోవాలని సూచించగా పరిశీలిస్తామని రైల్వే మంత్రి హామీ ఇచ్చారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement