Friday, March 15, 2024

నీరు, విద్యుత్‌ ఆదా.. సూక్ష్మ సేద్యంపై నాబార్డు తాజా అధ్యయనం

అమరావతి, ఆంధ్రప్రభ : దేశంలో అవకాశం ఉన్న అన్ని ప్రాంతాల్లో రైతాంగం సూక్ష్మ సేద్యం (మైక్రో ఇరిగేషన్‌)పై దృష్టి సారించేలా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డు) అభిప్రాయపడింది. ఏపీతో సహా దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల్ల్రోనే 70 శాతం సూక్ష్మ సేద్యం విస్తీర్ణం ఉంటే మిగతా రాష్ట్రాల్రన్నిటిలో కలిపి కేవలం 30 శాతం విస్తీర్ణం మాత్రమే ఉన్నట్టు తాజా నివేదికలో నాబార్డు వెల్లడించింది. ఈ మేరకు సూక్ష్మ సేద్యం వల్ల ఒనగూరే ప్రయోజనాలపై తమ కన్సల్టెన్నీ సంస్థ నాబ్కాన్స్‌ అధ్యయన నివేదికను నాబార్డు విడుదల చేసింది. సాధారణ సంప్రదాయ వ్యవసాయంతో పోలిస్తే సూక్ష్మ సేద్యం వల్ల నీరుతో పాటు- విద్యుత్‌ ను భారీగాగా పొదుపు చేయవచ్చనీ, కూలీల కయ్యే వ్యయం కూడా పరిమితంగా ఉంటుందని నాబార్డు తెలిపింది.

లక్ష హెక్టార్ల విస్తీర్ణాన్ని ఒక యూనిట్‌ గా తీసుకుని అధ్యయనం చేస్తే సుమారు 15 టీఎంసీల నీరు ఆదా అయ్యే అవకాశం ఉన్నట్టు స్పష్టమైంది. అంతేకాకుండా సుమారు రూ 62 కోట్ల విలువైన విద్యుత్‌, రూ 127 కోట్ల విలువైన కూలీల ఖర్చు కూడా రైతులకు ఆదా అవుతుందని నాబార్డు తెలిపింది. ఒక హెక్టారును యూనిట్‌ గా తీసుకుంటే గంటకు 1553 కిలోవాట్ల విద్యుత్‌ ఆదా అవుతుంది.. 52 పనిదినాలకు సంబంధించి కూలి ఖర్చు మిగిలిపోతుంది.. మొత్తంగా సాగు వ్యయం రూ 21,500 తగ్గి అదనంగా రూ 1,15,000లు రైతులకు ఆదాయం వచ్చే అవకాశం ఉందని నాబ్కాన్స్‌ అధ్యయన నివేదికలో వెల్లడైనట్టు నాబార్డు ప్రకటించింది.

- Advertisement -

ఏపీలో 13.41 లక్షల హెక్టార్లలో సేద్యం..

దేశవ్యాప్తంగా సూక్ష్మ సేద్య విస్తీర్ణం కేవలం 5 రాష్ట్రాల్ల్రో 70 శాతం మేర ఉన్నట్టు నాబార్డు తెలిపింది. ఏపీతో పాటు కర్ణాటక, తమిళనాడు, గుజరాత్‌, మహారాష్ట్రలో రైతులు సూక్ష్మ సేద్య విధానంలో పంటలు పండిస్తున్నారు.. అందులోనూ ఏపీ అగ్రగామిగా ఉంది. మొత్తం 11.91 లక్షల మంది రైతులు 13.41 లక్షల హెక్టార్లలో మైక్రో ఇరిగేషన్‌ పద్దతులు పాటిస్తున్నారు. 2022-23 ఆర్ధిక సంవత్సరంలో ఏపీలో 75 వేల హెక్టార్లలో అదనంగా సూక్ష్మ సేద్యం చేపట్టాలని లక్ష్యంగా నిర్ణయించుకుని ఇప్పటివరకు 60,500 హెక్టార్లలో సాగు చేపట్టారు. 2,38,070 హెక్టార్లలో సూక్ష్మ సేద్యం చేసేందుకు ఆసక్తి చూపిస్తూ సబ్సిడీ పరికరాల కోసం సుమారు 2 లక్షల మంది రైతు భరోసా కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకున్నారు.

సబ్సిడీపై పరికరాలు..

సూక్ష్మ సేద్యం చేపట్టే రైతులకు సబ్సిడీపై బిందు, తుంపర సేద్య పరికరాలను ప్రభుత్వం అందిస్తోంది. ప్రధానమంత్రి కృషీ సంచాయి యోజన (పీఎం కేఎస్‌ వై) ద్వారా ఏపీ ప్రభుత్వం రైతులను సూక్ష్మ సేద్యం కోసం ప్రోత్సాహం అందిస్తున్నట్టు నాబార్డు తెలిపింది. తీవ్రమైన నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న రాయలసీమ జిల్లాలతో పాటు మెట్ట ప్రాంతాల్లో సూక్ష్మ సేద్యం విస్తరణకు ప్రాధాన్యమిస్తూ ప్రభుత్వం సబ్సిడీ అందిస్తోంది. ఈ మేరకు రైతులు ఆర్బీకేల్లో పేర్లు నమోదు చేసుకుంటున్నారు. అర్హత ఉన్న ప్రతి రైతుకు సబ్సిడీపై తుంపర, బిందు సేద్యం పరికరాలను అందించనున్నట్టు ఇటీవల ప్రభుత్వం ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement