Sunday, May 19, 2024

సినీ ఎడిట‌ర్ గౌతంరాజు ఇక‌లేరు.. అనారోగ్యంతో కన్నుమూత

సినీ ఇండస్ట్రీలో విషాదం నెల‌కొంది. సినిమా ఎడిటర్ గౌతమ్‌రాజు (68) తుదిశ్వాస విడిచారు. కొద్ది రోజులుగా హెల్త్ బాగాలేక‌ బాధపడుతున్న ఆయన మంగళవారం అర్ధరాత్రి హైదరాబాద్‌లో కన్నుమూశారు. ఆయన మరణవార్తతో సినీ పరిశ్రమలో విషాదం నెల‌కొంది. గౌతమ్‌ రాజు మృతిపై పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సంతాపం వ్యక్తం చేశారు. గౌతమ్‌రాజు కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

తెలుగు, హిందీ, తమిళం, కన్నడ వంటి అనేక‌ భాషల్లో ఎన్నో చిత్రాలకు గౌతమ్‌రాజు ఎడిటర్‌గా పనిచేశారు. సుమారు 800 చిత్రాలకు పైగా ఎడిటర్‌గా పనిచేసి సినీ పరిశ్రమలో చెరగని ముద్ర వేశారు. ముఖ్యంగా తెలుగులో తెరకెక్కిన ఎన్నో హిట్‌ చిత్రాలకు ఆయన ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రముఖ నటులు చిరంజీవి, పవన్‌కల్యాణ్‌, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌ నటించిన చాలా సినిమాలకు ఆయన పనిచేశారు. ‘ఆది’, ‘ఖైదీ నెంబర్‌ 150’, ‘గబ్బర్‌సింగ్‌’, ‘కిక్‌’, ‘రేసుగుర్రం’, ‘గోపాల గోపాల’, ‘అదుర్స్‌’, ‘బలుపు’, ‘రచ్చ’, ‘ఊసరవెల్లి’, ‘బద్రీనాథ్’, ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’, ‘కాటమరాయుడు’ తదితర ప్రాజెక్ట్‌లతో ఆయన సినీ ప్రేక్షకుడి మది గెలుచుకున్నారు. ‘చట్టానికి కళ్లులేవు’ సినిమాతో గౌతమ్‌రాజు ఎడిటర్‌గా బాధ్యతలు చేపట్టారు. ‘ఆది’ చిత్రానికి ఉత్తమ ఎడిటర్‌గా నంది అవార్డును కూడా అందుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement